ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఓఎస్డీ ప్రియాంక వర్గీస్

by Web Desk |
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: పచ్చదనంలో మేడ్చల్ జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలపాలని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, మెదక్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు తో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలతో హరితహారం కార్యక్రమం పై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చూసేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వివరించారు. జిల్లా హైదరాబాద్ నగరానికి చేరువలో ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో వీలైనంత ఎక్కువ మొక్కలను నాటి వాటిని సంరక్షించి రాష్ట్రంలోనే జిల్లాను పచ్చదనంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలని ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు.

జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటనలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో హరితహారం కార్యక్రమం, నర్సరీల పరిశీలనకు తాను సైతం క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా మొక్కలు నాటాలని ఈ విషయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు.

నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న గోడలపై, పాఠశాల ప్రహరీలలో మంచి బొమ్మలను వేయించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఎకరం విస్తీర్ణంలో శాండల్ వుడ్ పార్కును తయారు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారంలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు వివరించారు.

అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలోని కండ్లకోయ లో ఇటీవల ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్ ఎంతో బాగుందన్నారు. మరిన్ని ఆక్సిజన్ పార్క్ లు అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు పనులు చేస్తామని సమావేశంలో కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో తాను సైతం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు.

2022 జూన్ లో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సిబ్బంది అందరూ సన్నద్దంగా ఉన్నారని అన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచడంతో భావితరాలకు మంచి వాతావరణాన్ని, ఎలాంటి కాలుష్యం, కలుషితం లేని వాతావరణం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ విషయంలో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు సైతం నిర్వహించి మొక్కలు పెంచేందుకు గ్రామాలు, మున్సిపాలిటీలను దత్తత తీసుకోవాలని తెలియజేశామని మొక్కలు పెంచి పార్కులను ఏర్పాటు చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా.. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి పద్మజారాణి, జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed