ఢిల్లీ దీక్షకు సీఎం కేసీఆర్ దూరం.. మంత్రుల్లో నో క్లారిటీ?

by Disha Web Desk 2 |
ఢిల్లీ దీక్షకు సీఎం కేసీఆర్ దూరం.. మంత్రుల్లో నో క్లారిటీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి టీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా చేపడుతోంది. యాసంగి ధాన్యం పూర్తిగా కొనుగోళ్లు చేయాలనే డిమాండ్‌తో చేపట్టే ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనేదానిపై క్లారిటీ రాలేదు. అధికారికంగా ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం చంద్రబాబునాయుడు సీఎం హోదాలో ఢిల్లీలో ధర్నా చేపట్టడంతో జాతీయ మీడియాలో రావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ధాన్యం కొనుగోళ్లపై ఈనెల 11న చేపట్టే ధర్నాలో కేసీఆర్ పాల్గొనడంపై మంత్రులు, ఎమ్మెల్యేల్లో సైతం క్లారిటీ లేదు. పాల్గొంటేనే ధర్నాకు గుర్తింపు లభించడంతో పాటు రైతుసంఘాలు, ఇతరపార్టీల సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఎవరు ధర్నాకు లీడ్ చేస్తారనేది పార్టీలో చర్చనీయాంశమైంది.

తెలంగాణలో యాసంగిలో రా రైస్ రాదని, బాయిల్డ్ రైస్ వస్తుందని దానిని కేంద్రమే కొనుగోలు చేయాలని ఇప్పటికే టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అయినా కేంద్రంనుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈ నెల 11 ఢిల్లీలో ధర్నాకు టీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. ఢిల్లీలో ధర్నా చేపట్టడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి. 2013 ఏప్రిల్ 29,30 తేదీల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం రాజకీయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. రెండ్రోజులపాటు సాగిన ధర్నాలో పాల్గొని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షించారు. మద్దతు కూడగట్టారు. జాతీయ మీడియాలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటారు. రాష్ట్రాన్ని సాధించారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబునాయుడు సీఎం హోదాలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. జాతీయ మీడియాను ఆకర్షించి హోదా ఆశ్యకతను చాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అయితే అదే తరహాలో కేసీఆర్ సైతం ధాన్యం కొనుగోళ్లపై, తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద వైఖరీని ఎండగట్టాలంటే ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో విధిగా పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితి. ధర్నాలో పాల్గొనే అంశంపై అధికారంగా ప్రకటన వెలువడలేదు. మంత్రులు, టీఆర్ఎస్ వర్గాలు సైతం ఎక్కడా ప్రకటించలేదు.

ధర్నాలో 350 మంది ప్రతినిధులు..

ఢిల్లీలో ఈనెల 11న తెలంగాణ భవన్ వద్ద నిర్వహించే ధర్నాకు టీఆర్ఎస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లీడ్ చేసే బాధ్యతను ఎంపీలకు, మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. అయితే, ధర్నాకు రాష్ట్రం నుంచి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ అధ్యక్షులు పాల్గొననున్నారు. వీరందరికీ ఇప్పటికే టికెట్లు బుక్ చేసినట్లు సమాచారం. అయితే అందరూ ఒకేసారి కాకుండా ఈ నెల 9, 10 తేదీల్లో వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వారికి అకామిడేషన్ బాధ్యతను ఎంపీలకు అప్పగించినట్లు తెలిసింది. ఒకవేళ సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొనకపోతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేక, రాజ్యసభ పక్షనేత కేకే, లేక లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు లేక మరెవరైనా లీడ్ చేస్తారా? అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ పాల్గొంటేనే ధర్నాకు గుర్తింపు అని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు..

సీఎం కేసీఆర్ ఈనెల 3న వైద్య చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లారు. పంటి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కేసీఆర్‌కు ఈనెల 4న డాక్టర్ ఒక పన్నును తొలగించారు. అయితే 5న రెస్ట్ తీసుకున్న ఆయన బుధవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే ప్రధానమంత్రిని కలుస్తారని ప్రచారం జరిగినప్పటికీ పంటినొప్పితో తీసుకోలేదని సమాచారం. ఈనెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాకు కేసీఆర్ తరలివెళ్లి పాల్గొంటారా? లేదా? అనేది సందిగ్ధం నెలకొంది. పార్టీ నుంచి ఎలాంటి సమాచారంను అధికారికంగా వెలువరించలేదు. ఈ విషయంపై మంత్రుల్లో సైతం నో క్లారిటీ.


Next Story