అందరి చిట్టా నా దగ్గరుంది.. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి: కేసీఆర్

by Disha Web Desk 2 |
అందరి చిట్టా నా దగ్గరుంది.. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'అతివిశ్వాసం వద్దు... బొక్కబోర్లా పడొద్దు.. ఎమ్మెల్యేలు సుప్రీం అనుకోవద్దు.. అందరి చిట్టా నాదగ్గర ఉంది.. ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావాలి... ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి' అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్వేలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుసరించే ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. వారికి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలోని కులవృత్తులందరితో సహపంక్తి భోజనం చేయాలని, ఆదునిక సాంకేతికతను వివరించాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్నవిధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగాది తర్వాత ఏప్రిల్ 8లోపు ఢిల్లీలో కేసీఆర్ ధర్నా నిర్వహించే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

మత చాందస్సా వాదులను దేశం నుంచి తరమి కొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కూడా రానివొద్దని అన్నారు. ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని పిలుపు నిచ్చారు. రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు ఏదోరకంగా నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి చోటా సర్వే రిపోర్టులు వస్తున్నాయని, ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మారాలన్నారు. రాని వారి స్థానాలు మారుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరాగాంధీ సైతం 1971లో ఎదురే లేదని అతివిశ్వాసంతో పోతే మళ్లీ ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం సెంటిమెంట్ రాజకీయం చేస్తోందని దానిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. అదే విధంగా విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేవరకు కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు.

23న నియోజకవర్గాల్లో స‌న్నాహాక స‌మావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల‌ 24, 25 తేదీల్లో రైతుల‌కు మ‌ద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు. ఈ నెల 26న గ్రామ పంచాయ‌తీలు, 27న మండ‌ల ప్రజా ప‌రిష‌త్‌, 30న జిల్లా ప‌రిష‌త్ లు కేంద్ర రైతు వ్యతిరేక‌ విధానాలు, వైఖ‌రికి నిర‌స‌న‌గా తీర్మాణాలు చేయనున్నారు. 28న యాదాద్రికి పార్టీ శ్రేణులంతా త‌ర‌లిరావాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి పిడికెడు బియ్యాన్ని సేకరించి ప్రధాని మోడీకి పంపించేందుకు కార్యచరణ చేపట్టారు. అదే విధంగా అన్ని యూనివర్సిటీ, కళాశాలల్లో విద్యార్థి సంఘాలతో టీఆర్ఎస్వీ నేతలు లీడ్ తీసుకొని బీజేపీ విధానాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించనున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి మంచి అభిప్రాయం ఉందని, కానీ ప్రతి రోజూపార్టీ శ్రేణుల్లో ప్రజల్లో ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత స్తబ్దత ఉందని అది పోవాలని, కష్టపడి పనిచేయాలని సూచించారు. అన్ని కేసీఆర్ చూసుకుంటారనేది పోవాలన్నారు. ఓన్లీ ఫేస్ ఆఫ్ కేసీఆర్ అనే భావన పోవాలని అందుకుకష్టపడి పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఒక వైపు కేంద్రంపై పోరు... మరోవైపు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ పార్టీని మరింత బలోపేతం దిశగా గులాబీ బాస్ కార్యచరణ చేపట్టారు.



Next Story

Most Viewed