కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. 'వాటర్‌మాన్' రాజేంద్రసింగ్ హెచ్చరిక

by Disha Web Desk 2 |
కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. వాటర్‌మాన్ రాజేంద్రసింగ్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని, సుప్రీంకోర్టు సహా ఎన్జీటీ లాంటి పలు న్యాయస్థానాలు గతంలో వెలువరించిన తీర్పులను ఉల్లంఘించడమేనని 'వాటర్ మాన్' రాజేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వమే అయినందున వారు ఇచ్చే నివేదిక పాలకులకు అనుకూలంగానే ఉంటుందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే ఈ జీవోను ఎత్తివేయాలనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షిస్తామంటూ గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన 'జాతీయ నదుల పరిరక్షణ' సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించి నెల రోజులు కూడా తిరగకముందే సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిపుణుల కమిటీ నివేదిక ఇందుకు భిన్నంగా ఉంటుందనే భావన కలగడంలేదని, 1996లో వెలువడిన ఈ జీవో ద్వారా ఏడు మండలాల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని సుమారు 1.32 లక్షల ఎకరాల భూమికి రక్షణ కల్పించిందని, ఇప్పుడు ఎత్తివేయడం ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి జలాశయాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. గోదావరి నుంచి మల్లన్నసాగర్ మీదుగా వచ్చే నీటితో హైదరాబాద్ నగరానికి వందేళ్ళ వరకు తాగునీటి సమస్య ఉండదని పేర్కొంటూ జీవో 111ను ఎత్తివేయడం గురించి సీఎం మాట్లాడడం సహజ వనరుల పరిరక్షణకు ప్రమాదాన్ని కొని తెస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడమంటే సుప్రీంకోర్టు 2001లో వెలువరించిన తీర్పుతో పాటు మరికొన్ని తీర్పులను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48-ఏ ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి చెరువులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ జీవోను ఎత్తివేయడం ద్వారా ఏక కాలంలో రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా చెరువులను పరిరక్షించాలనే ఉద్దేశమే ఉన్నట్లయితే 84 గ్రామాల ప్రజలను మరో చోటికి తరలించవచ్చని, ఈ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తారని వ్యాఖ్యానించారు.

ఈ రెండు చెరువులను, సహజ వనరులను కాపాడుకునేలా ఆదర్శంగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే అనివార్యంగా తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని, ఆ పరిస్థితులను ఆయనే కల్పించారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ కాకతీయ లాంటి పథకాలను రాజేంద్రసింగ్ గతంలో పూర్తిస్థాయిలో కీర్తించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed