వరవరరావుపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష పడవచ్చు

by Disha Web Desk 12 |
వరవరరావుపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష పడవచ్చు
X

నేషనల్: ప్రముఖ విప్లవ కవి, కార్యకర్త వరవరరావుపై అభియోగాలు తీవ్రాతితీవ్రమైనవని, అవి రుజువైతే మరణశిక్ష కూడా విధించవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్ఐఏ- పేర్కొంది. వరవరరావు పెట్టుకున్న శాశ్వత మెడికల్ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చాలని బాంబే హైకోర్టుకు ఎన్ఐఏ విన్నవించింది. ఎల్గార్ పరిషత్‌కి మావోయిస్టు లింక్ కేసులో నిందితుడైన తెలుగు కవి వరవరరావు (83) వృద్ధాప్య సంబంధిత సమస్యతో సతమతమవుతున్నట్లు కనిపిస్తోందని ఎన్ఐఏ పక్షాన వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ హైకోర్టుకు చెప్పారు. జైల్లో కానీ, అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఆయనకు అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎన్ఐఏ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. వరవరరావుపై అభియోగాలు జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన నేర చర్యల్లో భాగంగా ఉన్నాయని, తనపై ఆరోపణలు రుజువైతే మరణశిక్షకు పాత్రమవుతాయని న్యాయవాది చెప్పారు.

వరవరరావుకు నిరంతర వైద్య సంరక్షణ అవసరమన్న వైద్యుల నివేదిక ఆధారంగా హైకోర్టు గత సంవత్సరం తాత్కాలిక వైద్య బెయిల్ మంజూరు చేసిందని, ఇప్పుడు ఆయనకు స్వస్థత చేకూరినందున శాశ్వత వైద్య బెయిల్ సమస్యే తలెత్తదని ఎన్ఐఏ తరపు న్యాయవాది వాదించారు. శాశ్వత వైద్య బెయిల్ అంటే తుది విచారణ పూర్తయ్యేంతవరకు ఆయన బెయిల్‌పై కొనసాగవచ్చని ఉద్దేశమా అని కోర్టును ప్రశ్నించారు. కాగా వరవరరావు పెట్టుకున్న మూడు బెయిల్ పిటిషన్లపై తుది తీర్పు ప్రకటించేంతవరకు ఆయనను ముంబైలోని తలోజా జైలు కు తరలించవద్దని హైకోర్టు పేర్కొంది.


Next Story

Most Viewed