ఆరు నెలలుగా అసంపూర్తిగానే పనులు.. ప్రారంభం కాకముందే పగుళ్లు ఏర్పడిన రోడ్లు

by Disha Web Desk 12 |
ఆరు నెలలుగా అసంపూర్తిగానే పనులు.. ప్రారంభం కాకముందే పగుళ్లు ఏర్పడిన రోడ్లు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల అభివృద్ధి కోసం సుమారు రూ.20 కోట్లతో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టారు. కానీ ఆ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. ఒక్కో వార్డుకు కోటి రూపాయల చొప్పున ఖర్చుతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సుమారు ఆరు నెలల క్రితం సీసీ రోడ్లు నిర్మించి లింక్ రోడ్లను మాత్రం వదిలేశారు. దీంతో సైడ్ డ్రైనేజ్ ద్వారా వచ్చే మురుగు నీరు మొత్తం అక్కడే నిలిచి పోతుంది.

దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్య గురించి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ మాత్రం చేతులు దులుపుకుని లింక్ రోడ్లు వేయకుండానే ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారని, సీసీ రోడ్లకు రెండు పక్కల మట్టి పోయాల్సిన పని ఉన్నప్పటికీ అలాగే వదిలేశారు. ఇలా అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతున్నామని వార్డు ప్రజలు తెలిపారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్..

మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో సుమారు రూ.20 కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, రోడ్డు నిర్మాణంలో నిర్మాణ పనులు కూడా అసంపూర్తిగా చేయడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని కొందరు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ పనులను పట్టించుకునే వారు లేరని వార్డులలో జరుగుతున్న పనులపై పర్యవేక్షించాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు లేకపోలేదు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకముందే కొన్నిచోట్ల రోడ్లు పగుళ్లు ఏర్పడటం రాత్రివేళ సైతం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా కానీ ఎవరూ పట్టించుకోక పోవడం వెనుక అసలు ఆంతర్యమేమిటని ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed