కేంద్రాన్ని తిట్టడానికే బడ్జెట్ సమావేశం.. టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్

by Disha Web Desk 12 |
కేంద్రాన్ని తిట్టడానికే బడ్జెట్ సమావేశం.. టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్
X

దిశ, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల జోనల్ సమావేశానికి బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మూడు నెలలుగా కేసీఆర్‌ని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు, బీజేపీ నాయకులు నిలదీస్తున్నారని, సమాధానం చెప్పలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. కేంద్రాన్ని బూచిగా చూపెడుతూ.. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. శాసనసభలో తమ పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు 30 మంది తో సమానమని, వారు ప్రశ్నిస్తున్నారని భయంతోనే సస్పెండ్ చేశారని ఆరోపించారు.

ఈ క్రమంలో కోర్టు తీర్పును కూడా కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైన విధానాన్ని.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని, దీంతో ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర వ్యతిరేకం వచ్చిందన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని, అక్కడి ప్రజలు బీజేపీ సంక్షేమ పథకాలను అర్థం చేసుకొని గెలిపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల లో నిన్న జరిగిన హోలీ వేడుకల్లో ఓ బీజేపీ కార్యకర్తను టీఆర్ఎస్ గుండాలు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు విరగొట్టారని, పోలీసులు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆరోపించారు.


Next Story

Most Viewed