ప్రజాస్వామ్యం చీకట్లో కూరుకుపోయింది: RSP

by Disha Web Desk 2 |
ప్రజాస్వామ్యం చీకట్లో కూరుకుపోయింది: RSP
X

దిశ, తుంగతుర్తి: కేంద్ర, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం అంధకారంలో కూరుకుపోయిందని స్వేరో నెట్వర్క్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఫణిగిరి గ్రామం బౌద్ధ క్షేత్రం సమీపంలో మంగళవారం రాజ్యాంగ రక్షణ-ఓటు హక్కు పరిరక్షణ కోసం 'జ్ఞాన దీక్షనే- భీమ్ దీక్ష' కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అస్తిత్వం ప్రమాదంలో పడటంతో పాటు ప్రజాస్వామ్యం, పేదలు చీకట్లో కూరుకుపోయారని అన్నారు. తరాలుగా పేదలు కష్టాలు, కన్నీళ్లతో అధికారం, అభివృద్ధి, ఆత్మగౌరవాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధిపత్య వర్గాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. దేశానికి అస్తిత్వాన్ని ఇచ్చిన రాజ్యాంగాన్ని పాలకులు పక్కదారి పట్టిస్తూ తమ స్వప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం కోసం ఆరాటపడటం దుర్మార్గంగా పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

అవగాహన ద్వారా ఓటు హక్కు ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతుందని, దీన్ని పక్కదారి పట్టిస్తే బానిసత్వంలో కూరుకుపోతామని వివరించారు. ప్రలోభాలకు లొంగని ఓటు, ప్రజల తలరాతలను సక్రమంగా మారుస్తుందని స్పష్టం చేశారు. ఆకాశమే హద్దుగా, విద్య ఆయుధంగా అడుగులు వేస్తూ స్వేరోస్ నెట్వర్క్ అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం, అధికారం అనే ప్రధాన లక్ష్యాలతో మహనీయుల అడుగుజాడల్లో కొనసాగుతోందని వివరించారు. స్వేరోల చైతన్యాన్ని మరింత ద్విగుణీకృతం చేయడానికి ప్రతి ఏడాది మహనీయులను స్మరిస్తూ దీక్షలను చేపడుతున్నామని, స్వేరోల తత్వానికి భీమ్ దీక్ష ఆక్సిజన్ వంటిదని వివరించారు. ఈ భీమ్ దీక్షలో చీఫ్ కన్వీనర్ పోడపంగి రాధ, ప్రారంభ కన్వీనర్ మిరియాల మధు, భీమ్ దీక్ష నిర్వాహకులు కొండగడుపుల ఎల్లయ్య, స్వేరో అనుబంధ సంఘాల రాష్ట్ర జోనల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed