షాద్‌నగర్‌లో మంగనూర్ వాసి దారుణ హత్య

by Batti.Sumithra |

కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎండీ హాసన్ దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం వీధిన పడింది.

షాద్‌నగర్‌లో మంగనూర్ వాసి దారుణ హత్య
X

దిశ, బిజినేపల్లి: కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎండీ హాసన్ దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన అరవింద్, శివాజీ, మంగనూరు గ్రామానికి చెందిన ఎండీ హాసన్‌లు దళారులుగా కలిసి మండలంలోని పలు గ్రామాల రైతుల నుంచి మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీరిలో మంగనూరు గ్రామానికి చెందిన ఎండీ హాసన్ (30) ఈ నెల 22వ తేదీ రాత్రి షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైనట్లు గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత ఖరీఫ్ సీజన్‌లో బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల రైతుల నుంచి ఈ ముగ్గురు పెద్ద ఎత్తున మొక్కజొన్న, వడ్లను కొనుగోలు చేశారు. అయితే రైతులకు చెల్లించాల్సిన డబ్బులను ఇవ్వకుండా నెల రోజులుగా "అప్పుడు, ఇప్పుడు" అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. వీరి మాటలకు విసిగిపోయిన రైతులు తమ పంట డబ్బులు ఇప్పించాలని బుధవారం బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన పై బిజినేపల్లి పోలీసులు విచారణ చేపడుతుండగానే ఎండీ హాసన్ హత్యకు గురైనట్లు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన అరవింద్, శివాజీ, ఎండీ హాసన్‌లు కొద్ది వారాలుగా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో, రైతులు ప్రతి రోజు అరవింద్, శివాజీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఎండీ హాసన్ వద్ద రైతులకు చెల్లించాల్సిన కొంత పంట డబ్బు ఉండటంతో, ఆ డబ్బు ఇవ్వాలని శివాజీ, అరవింద్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి షాద్‌నగర్ పట్టణంలోని ఓ వెంచర్‌లో మద్యం సేవించిన అనంతరం ఎండీ హాసన్ హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎండీ హాసన్‌కు భార్యతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ హత్య ఎలా జరిగింది ? ఎవరు చేశారు ? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story