డిబేట్‌కు పిలిచి అవమానించారు: స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కంప్లైంట్

by Gantepaka Srikanth |

శాసనమండలి సభ్యుడిని డిబేట్‌కి పిలిచి ఓ చానల్ అవమానపర్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

డిబేట్‌కు పిలిచి అవమానించారు: స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి సభ్యుడిని డిబేట్‌కి పిలిచి ఓ చానల్ అవమానపర్చడం తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం సదరు చానల్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రతో డిబేట్‌లో యాంకర్ వ్యవహరించడాన్ని ఎమ్మెల్సీ రవీందర్‌రావు అడ్డుకుంటున్నారని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇది రవీందర్‌రావుపై జరిగిన దాడి కాకుండా శాసనమండలి సభ్యుల మీద జరిగిన దాడిగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చైర్మన్ నుండి చర్యలు ఉంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. ఏబీఎన్ డిబేట్‌లో జరగనివి జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారని.. తాను అడ్డుకునే ప్రయత్నం చేశానని వెల్లడించారు. తమ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. ఆ డిబేట్‌లో పిచ్చి రాతలు, విష ప్రచారం చేసే వారిపై మాట్లాడినట్లు చెప్పారు. తనను గెస్ట్‌గా పిలిచి అవమానించడం కలిచివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్.రమణ, నవీన్ పాల్గొన్నారు.

Next Story