సీఎం కేసీఆర్‌ను సస్పెండ్ ​చేయండి

by Disha Web Desk |
సీఎం కేసీఆర్‌ను సస్పెండ్ ​చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయనను సస్పెండ్ చేయాలని హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పీకర్ చైర్ ఆయన కనుసన్నల్లో నడుస్తోందని తెలిపారు. శాసనసభ నుంచి తమను అకారణంగా బహిష్కరించారన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకం కోల్పోయిన వ్యక్తి దేశ్ కీ నేత ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం ఎందుకు స్పందించలేదని ఆయన చురకలంటించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ సంపాదన లేకపోతే యూపీ ఎన్నికలకు డబ్బు ఎలా పంపించారని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను చూసి అసహ్యించుకుంటున్నారని విమర్శలు చేశారు.

గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఈటలను అసెంబ్లీలో ఎదుర్కోలేక తమను సభ నుంచి సస్పెన్షన్ చేశారని తెలిపారు. రాజేందర్​ముఖం చూడకూడదనీ కేసీఆర్ ఈ కుట్ర పన్నాడని ఆయన ఆరోపించారు. సీఎం పాపాలన్నీ అసెంబ్లీలో చెబుతారని భయపడి ఇలా చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా.. ప్రజా క్షేత్రంలో తమ గొంతు నొక్కడం సాధ్యంకాదని ఆయన చెప్పుకొచ్చారు. ట్రిపుల్ ఆర్ కలిసి మంగళవారం అసెంబ్లీకి అడుగుపెడతామని, సీఎం కేసీఆర్​ఏం చేస్తాడో చూస్తామని రాజాసింగ్​సవాల్​విసిరారు.

అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మాట్లాడుతూ.. శాసన సభ ప్రారంభానికి ముందు హైకోర్టు తమను స్పీకర్​ను కలవాలని చెప్పిందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు కోర్టు సూచించిందని ఆయన తెలిపారు. తాము మంగళవారం ఉదయం 9 గంటలకు హైకోర్టు కాపీ తీసుకుని అసెంబ్లీకి వెళ్తామని స్పష్టం చేశారు.


Next Story