'కేసీఆర్ పచ్చ కామెర్లు వచ్చిన రోగితో సమానం'

by Disha Web Desk 2 |
కేసీఆర్ పచ్చ కామెర్లు వచ్చిన రోగితో సమానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరిధాన్యం విషయంలో ఇప్పుడు మరోసారి కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరి వేసుకోండి అని అసెంబ్లీ వేదికగా రైతులకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం మొత్తం కొంటా అని చెప్పి ఇప్పుడు దొంగ నాటకాలు ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా కేంద్రం ధాన్యం భారీ ఎత్తున కొంటోందని, దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్‌కు తన మీద నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు.

తనమీద తనకు విశ్వాసం పోయాకే పీకేల సాయం తీసుకుంటున్నాడని తెలిపారు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపును చూశాక కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని అన్నారు. కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాపై బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తున్నదనడం సిగ్గుచేటని మండిపడ్డారు. పచ్చ కామెర్ల రోగి కేసీఆర్.. ఆయన పొద్దంతా చేసేది ఓట్ల రాజకీయమే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ బిడ్డల గురించి ఒక్కనాడైనా కేసీఆర్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు కేసీఆర్ చరిత్ర రాయాలని పోటీ నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. 111జీవో ఎత్తేయడం అంటే పర్యావరణాన్ని పాడు చేయడమే అని, రియల్ ఎస్టేట్ కోసమే కేసీఆర్ ఈ జీవో ఎత్తేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడుతాడా? 'అసలు నీవు ముఖ్యమంత్రివా.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed