కరీంనగర్‌ కార్పోరేషన్ సహా బీజేపీకి దక్కింది మూడు పీఠాలే!

by Malleboina Mahesh |

తెలంగాణ బీజేపీకి అందని ద్రాక్షలా మున్సిపల్ పీఠాలు మిగిలాయి. ఆశించిన సీట్లు రాకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నేతల అసహనం.

కరీంనగర్‌ కార్పోరేషన్ సహా బీజేపీకి దక్కింది మూడు పీఠాలే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మున్సిపల్​ఎన్నికల్లో కమలనాథులు మొత్తంగా రెండు చైర్మన్లు, ఒక మేయర్​సీటును సొంతం చేసుకున్నారు. అవి కూడా స్వతంత్రుల మద్దతుతోనే కావడం విశేషం. కరీంనగర్ కార్పొరేషన్‌లో​బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్​కూడా మేయర్ స్థానంపై గురిపెట్టింది. అయితే బీజేపీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులతో చర్చలు జరపడంతో మేయర్​ఎన్నికకు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో కరీంనగర్​మేయర్​సీటుపై కాషాయం జెండా ఎగిరింది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలకు వచ్చేసరికి బీజేపీ నారాయణపేట, బైంసా రెండుచోట్ల మాత్రమే చైర్మన్ పీఠాలను దక్కించుకుంది.

నారాయణపేటలో బీజేపీ 11 కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవగా చైర్మన్​పదవికి ఒక కౌన్సిలర్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఎక్స్​అఫీషియో సభ్యుల ఓటింగ్‌తో కమలం పార్టీ చైర్మన్​పదవిని కైవసం చేసుకున్నది. చైర్మన్‌గా కొండా శ్వేతసత్యయాదవ్, వైస్​చైర్మన్‌గా మంజుల ఎన్నికయ్యారు. బైంసాలో 42 వార్డులకు ఎంఐఎం 12 స్థానాల్లో గెలవడంతో మున్సిపాలిటీని మజ్లిస్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ బీజేపీ సహకారంతో స్వతంత్రులు పీఠం ఎక్కారు. మున్సిపల్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి తూము దత్తాత్రి, వైస్ చైర్మన్‌గా బీబీ ఖతీజా సిద్ధిఖీ ఎన్నికయ్యారు. నిజామాబాద్​కార్పొరేషన్​పరిధిలో పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకున్నా ఎంపీ అరవింద్​మేయర్​పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయలేదని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీట్లు వచ్చినా దక్కని చైర్మన్ పదవి..

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులకు బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఇతరులు 11 స్థానాల్లో గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 25 కాగా స్వతంత్రులతో కలిసి బీజేపీ పీఠాన్ని దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనూష చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో కలిపి ఆమె పదవిని దక్కించుకున్నారు. వైస్ చైర్మన్‌గా మజ్లిస్ అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున చైర్‌పర్సన్‌ బరిలోకి దిగిన జోగు శైలజకు 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 20 చైర్మన్, రెండు మేయర్ పీఠాలు దక్కుతాయని కమలం శ్రేణులు భావిస్తే సొంతంగా ఒక చైర్మన్​స్థానం కూడ దక్కలేదు. దీంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story