ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ : పైడాకుల అశోక్

by Batti.Sumithra |

ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీకి రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతే తగిన గుణపాఠం చెబుతారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ : పైడాకుల అశోక్
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీకి రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతే తగిన గుణపాఠం చెబుతారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు శాంతియుత నిరసన, ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం సిగ్గుచేటని అన్నారు.

విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల గొంతును అణచివేయడం, ప్రశ్నించే వారిపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. యువత, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story