మహిళను నమ్మించి దోచేశారు.. వీడిన భారతమ్మ దోపిడీ కేసు మిస్టరీ

by Disha Web Desk 13 |
మహిళను నమ్మించి దోచేశారు.. వీడిన భారతమ్మ దోపిడీ కేసు మిస్టరీ
X

దిశ, ఫరూక్ నగర్: ఒంటరి మహిళను నమ్మించి ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై దాడి జరిపి నగలు, నగదు దోచుకున్న సంఘటనలో కొత్తూరు పోలీసులు మిస్టరీని ఛేదించారు. భారతమ్మ అనే మహిళకు సంబంధించిన ఈ దోపిడీ కేసు వివరాలను శంషాబాద్ జగదీశ్వర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పోలీస్ స్టేషన్ లో స్థానిక ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన ఎస్బిపల్లికి చెందిన భారతమ్మ అనే మహిళ డ్వాక్రా డబ్బులు ఆరువేల రూపాయలు చెల్లించడానికి పెంజర్ల రోడ్డు వద్ద నిలబడి ఉండగా కొందుర్గు మండలం విశ్వనాథ్ పూర్ కు చెందిన మల్లేష్ ఎలికట్ట కు చెందిన శివలింగం ఇద్దరు డ్రైవర్లు భారతమ్మను నమ్మించి తమ వెంట తీసుకెళ్లారు.


నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో దాడి చేసి ఆమె వద్ద ఉన్న ఐదు మాసాల బంగారు వస్తువులు, 10 తులాల కాళ్ల కడియాలు, వెండి పట్టీలు, 6 వేల నగదు బలవంతంగా దోచుకున్నారు. ఈ విషయమై బాధితురాలు భారతమ్మ కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు.

కొత్తూరు కల్లు కాంపౌండ్ వద్ద అనుమానాస్పదంగా పోలీసులకు దొరికిన నిందితులు శివలింగం, మల్లేష్ లను పట్టుకుని విచారించగా కేసులోని వాస్తవాలు వెలుగు చూశాయని డిసిపి జగదీశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎలికట్ట గ్రామానికి చెందిన శివలింగం 11 కేసుల్లో నేరస్తుడిని 10 కేసుల్లో ఇప్పటికే విచారణ పూర్తి అయిందని తెలిపారు. అనేక నేరాలకు పాల్పడిన శివలింగం ఇటీవలే షాద్ నగర్, పరిగి, కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై బైకు దొంగతనాల కేసులు కూడా నమోదయ్యాయని, దీనికి సంబంధించి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


ఎలికట్ట కు చెందిన పాత నేరస్తుడు శివలింగంపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేరస్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి కుషాల్కర్, కొత్తూరు సీఐ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. కేసు విచారణలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఎస్సై శంకర్, ఏఎస్సై అబ్దుల్లా, నలుగురు కానిస్టేబుల్స్ కు రివార్డులు ప్రకటించారు.


Next Story