బావుపేట్ రహదారి మరమ్మతులు చేయాలి

by Ratna Kumari |

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట్ గ్రామ ప్రధాన రహదారి గత నాలుగేళ్లుగా పూర్తిగా అధ్వాన్నంగా మారి ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మండిపడ్డారు.

బావుపేట్ రహదారి మరమ్మతులు చేయాలి
X

దిశ, కొత్తపల్లి : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట్ గ్రామ ప్రధాన రహదారి గత నాలుగేళ్లుగా పూర్తిగా అధ్వాన్నంగా మారి ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మండిపడ్డారు. గ్రామ ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఓర్సు రాజు ఆధ్వర్యంలో బావుపేట్ గ్రామంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ, మండల అధ్యక్షుడు ఓర్సు రాజు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రజలు రోడ్డు కోసం ఎదురుచూస్తున్నా పాలకులు, అధికారులు కనీస బాధ్యత కూడా తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారి విద్యార్థులు, రైతులు, మహిళలు, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నాణ్యమైన రహదారి నిర్మాణ పనులను ప్రారంభించి గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు గ్రామ ప్రజల బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. బావుపేట్ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, వెంటనే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలను విస్మరిస్తే మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా నాయకులు మహబూబ్ అలీ, మండల మహిళా అధ్యక్షురాలు ఓర్సు విమల, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దారంగుల గణేష్, నరేష్, మోహన్, మురళి, కార్తీక్, శేఖర్, రాజు, మహేందర్, సంపత్, విజయలక్ష్మి, సిద్ధు, వేణు, గణేష్, శ్రీను తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story