Basara IIIT Food Quality: ట్రిపుల్ ఐటీ- అసౌకర్యాల్లో మేటీ.... ఒకసారి ఆలుకూరలో కప్ప- మరోసారి బల్లి

by Dishanational1 |
Basara IIIT Food Quality And Bathroom Facilities
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: Basara IIIT Food Quality And Bathroom Facilities| బాసర ట్రిపుల్ ఐటీ.. పేరులో యూనివర్సిటీ.. తీరులో వరెస్ట్.. రాష్ట్రంలో ఏకైన విద్యాసంస్థ.. తెలంగాణకే తలమానికం.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలేడ్జీ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో అసౌకర్యాలు, అవస్థలు నెలకొన్నాయి. నల్లాలున్నా.. నీళ్లు రావాయే‌.. బాత్ రూంలున్నా.. డోర్లు లేవాయే.. కాటేజీలున్నా.. కంటి నిండా నిద్ర లేదాయే.. బెడ్లు లేక కటిక నేలపైనే నిద్రపోవాల్సిందే.. మూడు పూటలా భోజనం పెడుతున్నా.. నాణ్యత లేని నాసిరకం తిండి తింటున్నారు.. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే సంస్థ.. కారాగారాల్లో ఖైదీల కంటే అధ్వాన్న పరిస్థితుల్లో చదవుకునేందుకు నిత్యం నరకం అనుభవిస్తున్నారు..

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ప్రముఖ వర్సిటీ.. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతుండగా.. తాజాగా తమ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు చేపట్టిన ఏడు రోజుల శాంతియుత ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హాస్టల్లో విద్యార్థులకు కనీస వసతులు లేకపోవటంతో.. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా మారింది. హాస్టళ్లలో‌‌ నీటిని అందించే నళ్లాలున్నా.. నీళ్లు సరిగా వస్తలేవు. నీళ్లకు ఇబ్బందులున్నా.. పడిగాపులు కాస్తున్నా.. అధికారులు సమస్యను పట్టించుకోరు‌. స్నానానికి నీళ్లు లేక రెండు, మూడు రోజులకోసారి స్నానం చేయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు బాత్రూంలు, మరుగుదొడ్లు ఉన్నా.. వాటికి సరిగా తలుపుల్లేవు. మరుగుదొడ్లు బస్టాండ్ల కన్నా అధ్వాన్నం. కంపు వాసన వస్తున్నా.. క్లీన్ చేసేవాళ్లు లేరు. నెలల తరబడిగా శుభ్రం చేయకపోవడంతో మరుగుదొడ్లతో విద్యార్థులు రోగాల బారినపడుతున్నారు.

నీటి కొరత ఒకవైపు.. పైపుల లీకేజీలు మరోవైపు.. ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు ఉండటంతో నీరు వృథాగా పోతోంది. నీటి లీకేజీతో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు పెరిగి.. రోగాల బారిన పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఈ నిల్వ నీటిలో పడ్డారు. ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉండటంతో మురికి వాసన వస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు హాస్టళ్లలో బెడ్ల కొరత ఎక్కువ ఉంది. బెడ్లు లేకపోవటంతో సత్రంలో వలె ఒకే చోట విద్యార్థులు నేలపై పడుకుంటున్నారు. ఏళ్ల తరబడి బెడ్లు పంపిణీ చేయకపోవటంతో నేలపై పడుకుని అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా.. చెత్తా చెదారమే దర్శనిమిస్తోంది. అపరిశుభ్రమైన వాతావరణంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు డంప్ యార్డు వాతావరణం తలపిస్తున్నాయి.

ఇక మెస్ కాంట్రాకర్లదే ఇష్టారాజ్యంగా మారింది. అంతా పేద, మధ్య తరగతి విద్యార్థులు కాగా.. వీరికి సరైన భోజనం అందటం లేదు. నీళ్ల లాంటి పప్పు, కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు, ఉడికీ ఉడకని అన్నం విద్యార్థులకు పెడుతున్నారు‌. గతంలో చాలా సార్లు కూరల్లో పురుగులు వచ్చాయి. ఒకసారి ఆలు కూరలో కప్ప.. మరోసారి బల్లి వచ్చింది‌. ధర్మాబాద్ నుంచి నాసిరకం పప్పులు, కూరగాయలు తెచ్చి వండుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం, నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా.. భోజనం తీరు మారటం లేదు. నాణ్యతతో కూడిన భోజనం పెట్టడం లేదు. అల్పహరం పరిస్థితి ఇదే. చాలా మంది నాణ్యత లేని నాసిరకం భోజనం ఓ పూట తిని.. మరో పూట తినకుండా ఆకలితో అలమటిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలతో మెస్ కాంట్రాక్టు నడుస్తోందనే విమర్శలున్నాయి. గుడ్లు కూడా సరిగా సరఫరా చేయకపోగా.. అరకొరగానే పెడుతున్నారు. ఇక్కడ జైలులో ఖైదీల పరిస్థితి కంటే ఘోరంగా ఉన్నా.. చదువుకునేందుకు భరిస్తూ వస్తున్నారు.

Next Story

Most Viewed