కుక్కను తప్పించబోయి ఆటో డ్రైవర్ మృతి

by Batti.Sumithra |

కుక్క అడ్డుగా రావడంతో ఆటో అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కుక్కను తప్పించబోయి ఆటో డ్రైవర్ మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: కుక్క అడ్డుగా రావడంతో ఆటో అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, రాగన్నగూడలోని ఆర్‌జీకే బ్రహ్మణ్‌పల్లి ఫేజ్-3కు చెందిన బనావత్ అమర్ సింగ్ (47) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 23న ఉదయం 9 గంటలకు తన ఆటోలో ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తుర్కయంజాల్ నుంచి ఆర్‌జీకే బ్రహ్మణ్‌పల్లి వైపు వెళ్తుండగా బ్రహ్మణ్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద ఒక్కసారిగా ఓ కుక్క అడ్డుగా రావడంతో దానిని తప్పించబోయే క్రమంలో ఆటోను ఎడమవైపు తిప్పాడు. ఈ క్రమంలో అమర్ సింగ్ ఆటో నుంచి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మొదట రాగన్నగూడలోని ఏవీఎస్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 26, ఆదివారం రాత్రి 9.05 గంటలకు బ్రెయిన్ డెత్ కారణంగా అమర్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడి కుమారుడు బనావత్ నితిన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story