జర్నలిస్టుల సంక్షేమ హామీలు అమలు చేయాలి

by Ratna Kumari |

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది.

జర్నలిస్టుల సంక్షేమ హామీలు అమలు చేయాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు ముందు జర్నలిస్టులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మీడియా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.కే.సలీమా, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బనావత్ రవి నాయక్ మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, హెల్త్ కార్డులు అందించడంతో పాటు జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో రాయితీలు కల్పించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులు, నాయకులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Next Story