పార్టీలకు అతీతంగా అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు పని చేస్తున్నారు.. గుత్తా సుఖేందర్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 15:26:28  IST  )

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో జరిగిన 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పార్టీలకు అతీతంగా అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు పని చేస్తున్నారు.. గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో జరిగిన 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం ఆయన ‘సమర్థతను పెంచడానికి మరియు ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడానికి శాసనసభ్యుల సామర్థ్య నిర్మాణం’ అనే అంశంపై ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు పనిచేస్తున్నారని, ప్రజల అభ్యున్నతి కోసం చట్టాలను రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నైపుణ్యం, నైతికత మరియు దృక్పథంపైనే ప్రజాస్వామ్య పాలన ఆధారపడి ఉంటుందని, ప్రిసైడింగ్ అధికారులుగా తాము ప్రజాస్వామ్య విలువలకు సంరక్షకులుగా ఉన్నామని చెప్పారు. మన శాసనసభలు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, గౌరవంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందన్నారు.

శాసనసభ్యులు చట్టాల రూపకల్పన, ఆర్థిక పరిశీలన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, నైతిక ప్రవర్తన మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణలో ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని, అనుభవం, నైపుణ్యం కలిగిన శాసనమండలి.. ఆలోచనాత్మక చర్చలు, విధానాల మెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణలో నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమాలు, నిపుణులతో వర్క్‌షాప్‌లు మరియు ఎక్స్‌పోజర్ సందర్శనలు సభ్యుల పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడ్డాయని వివరించారు.

ఈ-శాసనసభలు, పేపర్ లెస్ సెషన్లు, డిజిటల్ లైబ్రరీలు మరియు ఏఐ (AI) ఆధారిత పరిశోధన సహాయం సభ ఉత్పాదకతను బాగా పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అనేక శాసనసభలు వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లను విజయవంతంగా ఉపయోగించాయని, సాంకేతికతను తెలివిగా వాడినప్పుడు ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఈ అనుభవం నిరూపించిందని చెప్పారు. కమిటీ వ్యవస్థలను కూడా మరింత శక్తివంతం చేయాలని ఆయన కోరారు. డిజిటల్ మీడియా ప్రసారాలు బాధ్యతాయుతంగా ఉండాలని, తప్పుడు సమాచారం వల్ల మంచి కంటే చెడే త్వరగా వ్యాపిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. సామర్థ్య నిర్మాణం అనేది కేవలం శాసనసభ్యులకే పరిమితం కాదని, శాసనసభ సిబ్బంది మరియు సచివాలయ అధికారులు కూడా సభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.

Next Story