చట్ట వ్యతిరేక పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏఎస్పీ శబరిష్

by Vinod kumar |

దిశ, మణుగూరు: చట్ట వ్యతిరేక పదార్థాలను - ASP Dr Shabarish said strict action would be taken if illegal substances were sold

చట్ట వ్యతిరేక పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏఎస్పీ శబరిష్
X

దిశ, మణుగూరు: చట్ట వ్యతిరేక పదార్థాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పీ డాక్టర్ శబరిష్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం ఉదయం మండలంలో సర్కిల్ ఇన్‌ స్పెక్టర్ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో ఎస్సైలు బట్ట పురుషోత్తం, వి.ఎల్.రావులు మూడు బృందాలుగా ఏర్పడి.. విశ్వసనీయ సమాచారం మేరకు గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న వారిపై దాడులు చేశారన్నారు. మండలంలోని రాజీవ్ గాంధీ నగర్, జీఎం ఆఫీస్ సింగారం ప్రాంతంలో భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు తెలిపారు. ఈ దాడిలో 19 పెద్ద బ్యాగుల అంబర్ ప్యాకెట్లు, 2 స్వాగత్ పెద్ద గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.


వాటి విలువ సుమారు రూ.10 లక్షల 20 వేలు ఉంటుందని పేర్కొన్నారు. గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న వ్యక్తులు వనమాల వేణుగోపాల్(45), వల్లభనేని రవి కుమార్(50), షేక్ అబ్దుల్ మునాఫ్ పాషా(34), సముద్రాల వెంకటేశ్వర్లు(42), చింతల రమణయ్య లని వివరించారు. ఈ ఐదుగురు వ్యక్తులు చతిస్గడ్ రాష్ట్రం కుంట ప్రాంతం నుంచి మండలంలోని షాప్ లో విక్రయించి, నలుగురు వ్యక్తులకు సరఫరా చేశారని తెలిపారు. ఈ వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, ఎస్సైలు బట్ట పురుషోత్తం, వి.ఎల్ రావు లను ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story