అర్ధరాత్రి అక్రమ ఇసుక దందా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

by Web Desk |
అర్ధరాత్రి అక్రమ ఇసుక దందా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల ర్యాంపు దగ్గర నాడీ గోదావరిలో మండలానికి చెందిన పెద్దిరెడ్డి అలియాస్ రామకృష్ణ రెడ్డి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఇసుకకు అనుమతి లేకున్నా అర్ధరాత్రులు యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నడని మండల ప్రజలు చెబుతున్నారు. దీంతో నిత్యం చింతిర్యాల ప్రాంతంలో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోందట.పెద్దిరెడ్డి అక్రమార్కుల ముఠాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని మండల వ్యాప్తంగా వినబడుతోంది.

మండలంలోని పలు వీధుల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న అడిగేవారే కరువయ్యారని స్థానికులు చెప్పుకొస్తున్నారు. అర్ధరాత్రులు ఇసుక ట్రాక్టర్ల శబ్దాలతో ఇబ్బందులు పడుతున్నా రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నిజానికి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమార్కులు ఇచ్చే ముడుపులు పుచ్చుకొని అక్రమ ఇసుక దందాపై దృష్టి సారించడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రులు పదుల సంఖ్యలో నడి గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా ఒక్కో ట్రిప్పుకు వేల రూపాయలు వసూలు చేస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు అక్రమారులపై చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed