ఆశా భోంస్లే కన్నుమూత.. ప్రధాని మోడీ భావోద్వేగ నివాళి!

by Malleboina Mahesh |

దిగ్గజ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! భారతీయ సంగీతానికి తీరని లోటని ప్రధాని మోడీ భావోద్వేగ నివాళి. ఆమె పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని ప్రార్థన.

ఆశా భోంస్లే కన్నుమూత.. ప్రధాని మోడీ భావోద్వేగ నివాళి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని అలరించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విన్న వెంటనే ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని.. ఆశా భోంస్లే తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితమైన నివాళి అర్పించారు. ప్రధాని తన ట్వీట్‌లో.. "భారతదేశం గర్వించదగ్గ అత్యంత విలక్షణమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆశా భోంస్లే మరణం నన్ను ఎంతగానో కలచివేసింది.

దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రయాణం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. ఆమె పాడిన మధురమైన మెలోడీలు అయినా, హుషారైన పాటలైనా.. ప్రతి స్వరంలోనూ కాలాతీతమైన ప్రతిభ కనిపిస్తుంది. ఆమెతో నాకు ఉన్న పరిచయాలు, జ్ఞాపకాలు ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటాయి" అని ప్రధాని పేర్కొన్నారు.

ఆశా భోంస్లే మరణం కేవలం ఒక కుటుంబానికే కాకుండా, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, సంగీతం అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని, రాబోయే తరాలకు ఆమె ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచిపోతారని మోడీ కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

Next Story