కేసీఆర్‌ని గద్దె దింపడమే సకల సమస్యలకు పరిష్కారం: మంద కృష్ణ మాదిగ

by Disha Web Desk 12 |
కేసీఆర్‌ని గద్దె దింపడమే సకల సమస్యలకు పరిష్కారం: మంద కృష్ణ మాదిగ
X

దిశ, భువనగిరి రూరల్: భారత రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సదస్సు ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ ఎఫ్, ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, ప్రొపెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యుత్తమ రాజ్యాంగమని కొనియాడుతుంటే కేసీఆర్ మాత్రం రాజ్యాంగం మార్చాలని అంటున్నాడు.

కేసీఆర్ నియంతృత్వానికి, రాచరిక పాలనకు రాజ్యాంగం అడ్డు తగులుతుందనే కారణంతోనే మార్చాలని అంటున్నారని, రాజ్యాంగ మౌలిక లక్షణాలైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, స్వాతంత్య్రం, పౌర హక్కులు అంటే కేసీఆర్‌కి నచ్చడం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కేసీఆర్ చెబుతున్న కారణాలలో ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్ధత లేవని, ఆయన మాటలు రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చాయని, ఆ ప్రమాదాన్ని తెలంగాణలోనే ఎదుర్కొని కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అన్నారు.

అందుకోసం ఏప్రిల్ 09న లక్షలాది మంది ప్రజలతో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి మహా సభను నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులంతా ఏకతాటి మీదకు వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల్లోకి వెళ్లాలని, కేసీఆర్‌ను రాజకీయంగా గద్దె దింపితేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిది ఏండ్లుగా రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకమై పోరాటం చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, తెలంగాణలో సమస్త వర్గాల సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జ్ నల్ల చంద్ర స్వామి మాదిగ, జిల్లా అధ్యక్షులు బొడ్డు కృష్ణ మాదిగ, చాట్ల స్వామి మాదిగ, పొత్నక్ ప్రమోద్ కుమార్, సిర్పంగాశివలింగం, బట్టు రామచంద్రయ్య, బండారు రావడం, సలీం పాషా, బీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం కాసిం, ఇటుకల దేవేందర్, దుబ్బ రామకృష్ణ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, పడిగల ప్రదీప్, కౌన్సిలర్లు ఈరపాక నర్సింహ, ఎర్ర మహేష్, అంజయ్య, బోయ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story