డీఈసీల నియామకంలో రూల్స్ బ్రేక్.. కార్పొరేట్​యాజమాన్యాలతో కుమ్మక్కై..?

by Disha Web Desk 19 |
డీఈసీల నియామకంలో రూల్స్ బ్రేక్.. కార్పొరేట్​యాజమాన్యాలతో కుమ్మక్కై..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిస్ట్రిక్ట్​ఎగ్జామినేషన్​కమిటీ(డీఈసీ) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఇంటర్ బోర్డు అధికారులు తమ కోటరీకే పెద్దపీట వేస్తున్నారు. సీనియారిటీ ఉన్నా తమకు అంటిపెట్టుకుని ఉండేవారికే డీఈసీలో చోటు కల్పిస్తున్నారు. జూనియర్లలో తమకు దగ్గరగా ఉండేవారికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అంతేకాకుండా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏండ్ల తరబడి డిస్ట్రిక్ట్​ఎగ్జామినేషన్​కమిటీ(డీఈసీ) మెంబర్లుగా కొనసాగుతున్నారు. ఈ కమిటీలో ఉండేవారు బోర్డు నిబంధనల ప్రకారం మూడేండ్లకు మించి కొనసాగేందుకు అర్హత లేదు. కానీ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. ఏండ్లకు ఏండ్లుగా వారినే కొనసాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు పదేండ్లుగా ఒకే వ్యక్తి కొనసాగుతున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమిటీలో ఉన్నవారు, బోర్డు అధికారులు కార్పొరేట్​యాజమాన్యాలతో కుమ్మక్కవడంతో సర్కార్​కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది.

పరీక్షల పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్​కమిటీ పాత్ర కీలకం. ఇంటర్​విద్యార్థులకు జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌తో పాటు వార్షిక పరీక్షల సమయంలోనూ వీరు పరీక్షల విధులను, కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ కమిటీ కన్వీనర్‌గా జిల్లా ఇంటర్మీడియట్​విద్యాధికారి ఉంటారు. మెంబర్లుగా సీనియర్​ప్రిన్సిపాల్, సీనియర్ జూనియర్​ లెక్చరర్​ఉంటారు. ప్రతి జిల్లాలో డీఈసీ ఉంటుంది. 40 పరీక్ష కేంద్రాలకు మించి అధికంగా ఉంటే కమిటీ మెంబర్స్ సంఖ్య పెరుగుతుంది. ఈ కమిటీ మెంబర్స్ డిపార్ట్మెంటల్ అధికారులుగా(అబ్జర్వర్లుగా) ఎవరిని ఏ కాలేజీకి వేయాలనే లిస్టును సిద్ధం చేస్తారు. వారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల పేర్లే ఇందులో ఉండేలా చూసుకుంటారు. అనంతరం కార్పొరేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో భారీగా దండుకుంటున్నారు. కార్పొరేట్​కాలేజీల్లో ల్యాబులు లేకపోవడం, విద్యార్థులు రికార్డులు రాయకపోవడం వంటి విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు వారితో కుమ్మక్కై డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీనియర్లను కాకుండా జూనియర్లను డీఈసీ కమిటీ బాధ్యతలు అప్పగించడంపై ఇంటర్​బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వారికి అవకాశం కల్పించకపోగా బెదిరింపులకు గురిచేసి తమ అనుచరులకే విధులు కేటాయిస్తూ పరీక్షల సమయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు ప్రాక్టికల్​పరీక్షల సమయంలోనే భారీగా దండుకుంటున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేస్తున్నారు. జనగామ జిల్లాలో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లను కాదని తమకు భజన చేసే వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలో ఏడు సంవత్సరాలుగా ఒకే వ్యక్తిని డీఈసీ మెంబర్ గా కొనసాగిస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి పదేళ్లుగా అలాగే కొనసాగుతున్నారని, జగిత్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలోనూ అదే తీరు ఉందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఒకే వ్యక్తికి వరుసగా ఐదేండ్లు ఒకే పరీక్ష కేంద్రం వద్ద ఎగ్జామినర్‌గా, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌గా ఎలా విధులు కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్​ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభమైన మొదటి రెండు రోజులు కూడా పలు సెంటర్లలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్ లేకుండానే ఎగ్జామ్స్ నిర్వహించారు. కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కవడం, అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని వాపోతున్నారు.

సీనియారిటీ, సిన్సియారిటీని గుర్తించండి..

ఉద్యోగుల సీనియారిటీ, సిన్సియారిటీని గుర్తించి డీఈసీలుగా నియమించాలి. కొందరు బోర్డు అధికారులు కావాలనే నియమనిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చి ప్రభుత్వ విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్నారు. డీఈసీ, హైపవర్ కమిటీ, డిపార్ట్​మెంటల్​ఆఫీసర్ల కేటాయింపులో జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సీనియర్​అధ్యాపకులను, ప్రిన్సిపాళ్లకు డీఈసీలో ప్రాతినిధ్యం కల్పించాలి.

మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఇంటర్​విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్

Next Story

Most Viewed