మమతకు షాక్.. TMC కి మరో ఎంపీ రాజీనామా

by Muthe.Rajitha |

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గడిచిన వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు.

మమతకు షాక్.. TMC కి మరో ఎంపీ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గడిచిన వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు. టీఎంసీ సీనియర్ మహిళా నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ తన పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరుతూ ఆమె రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు.

వారంలోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీల గుడ్‌బై

టీఎంసీకి ఇరుకున పెట్టే విధంగా జూన్ 8వ తేదీన ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రాయ్ తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అంతర్గత అవినీతి, నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి కారణంగానే ఆయన తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాని నుంచి తేరుకోకముందే, ఇప్పుడు సుష్మితా దేవ్ కూడా రాజీనామా చేయడంతో టీఎంసీ పార్లమెంటరీ పక్షం బలహీనపడినట్టైంది.

లోక్‌సభలోనూ 'రెబల్' సెగ.. ఎన్‌డీఏకు మద్దతు

మరోవైపు లోక్‌సభలోనూ మమతా బెనర్జీకి తిరుగుబాటు సెగ తగులుతోంది. ఇటీవల కాలంలోనే దాదాపు 20 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు తిరుగుబావుటా ఎగురవేసి రెబల్స్‌గా మారారు. సీనియర్ నాయకురాలు కాకోలి ఘోష్ దాస్తిదార్ నేతృత్వంలోని ఈ రెబల్ ఎంపీల బృందం, కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ (NDA) కూటమికి కీలక అంశాలపై మద్దతు ఇస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అటు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇటు పార్లమెంట్‌లో ఎంపీల వరుస రాజీనామాలు మరియు తిరుగుబాట్లతో మమతా బెనర్జీ రాజకీయంగా అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నారు.

Next Story