ఇటుక వ్యాపారుల అరాచకం.. ఫిర్యాదుదారుడిపై దాడి

by Disha Web Desk 13 |
ఇటుక వ్యాపారుల అరాచకం.. ఫిర్యాదుదారుడిపై దాడి
X

దిశ, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఇటుక వ్యాపారుల అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతూ కోట్లాది రూపాయల ఇటుక వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు నిబంధనలను ఉల్లంఘించి సహజ వనరులైన మట్టి, కలపను యథేచ్ఛగా వాడుకుంటూ అడ్డుపడిన వారిపై దాడులకు దిగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రఘునాథపల్లి మండలంలోని బానాజీపేట గ్రామంలో ఖమ్మం జిల్లాకు చెందిన మాలకొండయ్య ఇలియాస్ మాలకొండ రాయుడు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన గొరిగే రవికి చెందిన 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు.


ఇందుకోసం పరిసర ప్రాంతాల్లోని చెరువుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తీసుకువచ్చి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాకుండా రఘునాథపల్లి - కంచనపల్లి గ్రామాల మధ్యన ఉన్న దొడ్డిగుంట, బానాజీపేట గుట్ట అటవీ ప్రాంతాల నుండి అక్రమంగా చెట్లను నరికి ఆ కర్రను ఇటుక బట్టీలకు వాడుతున్నాడు. ఈ నేపథ్యంలో రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఠాగూర్ జ్ఞానేశ్ సింగ్ అనే యువకుడు వారం రోజుల క్రితం మాలకొండయ్య అక్రమాలపై జిల్లా మైనింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం తన వ్యక్తిగత పనులపై బానాజీ పేటకు వెళ్లిన ఠాకూర్ డ్యాన్సింగ్ పై ఒక్కసారిగా మాలకొండయ్య అతని అనుచరులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. బాధితులు తెలిపిన వాంగ్మూలం ప్రకారం.. 'ఒరేయ్ తమపైనే ఫిర్యాదు చేస్తావా?' నిన్ను చంపి పాత రేస్తాం.. చూస్తా? అంటూ నా తలపై, ఎక్కడపడితే అక్కడ విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఆ దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్లాను. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో తొలుత జనగామ ఆస్పత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆ సెల్ ఫోన్ ఎక్కడ ఉంది?


ఠాకూర్ జ్ఞాన సింగ్ పై దాడి జరిగిన సమయంలో అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను మాలకొండ రాయుడు తీసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సెల్ ఫోన్ లో ఇటుక బట్టీలకు సంబంధించిన ఫోటోలతో పాటు ఇతర విలువైన డాక్యుమెంట్ కాపీలు ఉన్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు 'దిశ 'తో తెలిపారు. తమ సెల్ ఫోన్ తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరుతున్నారు.

ఫిర్యాదు చేస్తే ఇంత దారుణమా..?


చట్టవిరుద్ధంగా అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యాపారులు అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారని, బానాజీపేట గ్రామంలో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా వ్యక్తిని బయటికి పిలిచి రాడ్లతో పట్టపగలు విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారు.. మరి అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ వ్యాపారాలను నిలిపివేసి, అవి నిర్వహిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed