Telangana News: కొడుకులు పట్టించుకోవడం లేదు బిడ్డా.. బాధపడకు పెన్షన్ వచ్చేలా చేస్తా..

by Disha Web Desk 13 |
Telangana News: కొడుకులు పట్టించుకోవడం లేదు బిడ్డా.. బాధపడకు పెన్షన్ వచ్చేలా చేస్తా..
X

దిశ, భిక్కనూరు: 'బిడ్డా.. కొడుకులు పట్టించుకోవడం లేదు.. పెన్షన్ ఇప్పియు బాంచన్ కాల్మొక్త..' అంటూ ఓ వృద్ధురాలు తన గోడును వెల్ల బోసుకోగా.. 'బాధపడకు నేనున్నా.. పెన్షన్ వచ్చేలా చేస్తా..' అంటూ ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆమెలో పూర్తి ధైర్యాన్ని నింపాడు. భిక్కనూరు మండల కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన పెద్దమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. గర్భాలయంలో నుంచి బయటకు వచ్చిన ఆయనను ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బండి రాములు శాలువా కప్పి సత్కరించారు. ఆలయ మెట్లు దిగి వెళ్లే సమయంలో వృద్ధురాలు కొంతమంది అక్కడికి చేరుకొని పెన్షన్ కోసం అడిగారు. మండల కేంద్రానికి చెందిన పప్పుల పద్మవ్వ, గంప ముందుకు వచ్చి, తనని ఏ కొడుకు చూసుకోవడం లేదని, పెన్షన్ ఇప్పించాలని ఎన్నో రోజులుగా అడుగుతున్న బిడ్డా అంటూ బాధ పడుతుండగా, పక్కనే ఉన్న సర్పంచ్ తునికి వేణు, మాజీ సర్పంచ్ తాటిపాముల నాగభూషణం గౌడ్ ను ఈ అమ్మ సంగతేమిటని ప్రశ్నించారు. పెద్ద కొడుకు ఆర్టీసీ లో కండక్టర్ అని, చిన్న కుమారుడు టాక్టర్ నడుపుకుంటూ జీవిస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఎన్నిసార్లు పెన్షన్ కు దరఖాస్తు పెట్టినా రిజెక్ట్ అవుతుందన్నారు. ఆర్డీవో తో మాట్లాడతానని, పెన్షన్ వచ్చేలా చేస్తానని భరోసా కల్పించారు. మిగతా వృద్ధురాలకు సైతం పెన్షన్ ఇప్పిస్తానని భరోసా కల్పించాడు.

Next Story

Most Viewed