అమీన్​పూర్​పెద్ద చెరువు రియల్టర్ల చేతిలో విధ్యంసం!

by Web Desk |
అమీన్​పూర్​పెద్ద చెరువు రియల్టర్ల చేతిలో విధ్యంసం!
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి/అమీన్ పూర్: ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతియేటా రకరకాల అందమైన పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. ఆ వలస పక్షులు సేద తీరుతుంటే చూసి స్థానికులు ఆనందిస్తుంటారు. విడిది చేసిన పక్షుల కిలకిల రాగాలతో అలరించే ఆ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. చెరువు కట్ట పైకి వచ్చే సందర్శకులతో పర్యాటక ప్రాంతంగా కిటకిటలాడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిద్య సరస్సుగా గుర్తింపునిచ్చింది.

అలాంటి అందమైన చెరువు ఆగమైపోతున్నది. ఇటుగా పక్షుల రాకతగ్గిపోతున్నది. పక్షల కిలకిలరాగాలకు బదులుగా ఇప్పుడు బుల్డోజర్ చప్పుడు వినిపిస్తున్నది. రాత్రి వేళల్లో టిప్పర్లతో చెరువు లోపలికి రోడ్లు వేస్తున్నారు. చూస్తుండగానే ప్లాట్లు చేసి అమ్మకానికి పెడుతున్నారు. చెరువులు కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్ ఓ సారి ఈ చెరువు వైపు చూడాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కబ్జాకు గురవుతున్న సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​పెద్ద చెరువు పై 'దిశ' ప్రత్యేక కథనం..

వలస పక్షుల విడిది.. అమీన్​పూర్​ పెద్ద చెరువు..




ఆకాశానంటే భవంతుల మధ్య వలస పక్షుల కిలకిల రాగాలతో చూడముచ్చటగా ఉంటుంది అమీన్ పూర్​పెద్ద చెరువు. 1580 ప్రాంతంలో చెరువు నిర్మాణం జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మూడు తూములు, భారీ కట్టతో అద్భుతమైన నిర్మాణం గా ఉంటుంది. 450 ఎకరాల పరిధిలో ఈ చెరువు విస్తరించి ఉన్నది. 530 ఎలివేషన్‌తో ఉంటుంది. ఈ చెరువు కింద 1600 వందల ఎకరాల వరకు ఆయకట్టు ఉండగా ఇప్పుడు ఆ ప్రాంతంలో భారీ భవంతులు వెలిశాయి.




ఇదిలా ఉండగా ప్రతి ఏటా ఈ చెరువుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వలస వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఏండ్లుగా ఈ పక్షులను చూడడానికి పర్యావరణ ప్రేమికులు వస్తుంటారు. 166 రకాల పక్షులు, 9 రకాల చేపలు, 8 జాతుల ఇతర క్షీరదాలు, 34 రకాల సరిసృపాలు ఉంటాయి. తల్లతోక గాడ్విట్, గ్రే హెరాన్, నలుపు రెక్కల స్టిల్ట్స్, పెలికాన్​, పైడ్​కింగ్​ఫిషర్, స్రైటెడ్​ కొంగ, చెక్క కొంగలు ఇలా రకరకాల పక్షుల విడిది చేస్తుంటాయి.

జీవవైవిద్య సరస్సుగా గుర్తించిన ప్రభుత్వం..

పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులకు గ్రేటర్​హైదరాబాద్‌లో అమీన్​పూర్​పెద్ద చెరువు తెలియకుండా ఉండదు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఇక్కడకు వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షులను ఫోటోల్లో బందిస్తుంటారు. స్థానికులు గాలాలు వేసి చేపలు పడుతుంటారు. పిల్లా,పాపలతో వచ్చి స్థానికులు చెరువు కట్ట పై సేద తీరుతుంటారు. అయితే ఈ అందమైన చెరువులోకి సమీపంలోని ఉన్న పరిశ్రమల నుంచి కాలుష్య జలాలు రావడంతో పలు సందర్భాల్లో చేపలు మృతి చెందిన సంఘటనలు వెలుగు చూశాయి.

ఈ విషయం తెలుసుకున్న స్పెషల్​ప్రొటెక్షన్​ పోర్స్ డీజీ తేజ్​దీప్​కౌర్​ గతంలో ఈ చెరువును దత్తత తీసుకున్నారు. చెరువు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి ఆదివారం చెరువు కట్టపై వివిధ కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణం పై అవగాహన కల్పించారు. చెరువు ఎఫ్​టీఎల్​పరిధిని అన్యాక్రాంతం కాకుండా పకడ్భందీ చర్యలు చేపట్టారు. కాగా ఆమె పదవీ విరమణ చేయడంతో ఇక ఇటుగా రావడం లేదు. ఇదిలా ఉండగా చెరువు అందాలు, ప్రకృతిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2016 నబంబరులో బయోడైవర్సిటీ హెరిటేజ్​సైట్‌గా పెద్ద చెరువును గుర్తించింది.

రోడ్లు వేసి, ప్లాట్లుగా చేసుకుని..




గత కొద్ది రోజులుగా స్థానికంగా కొందరు రియల్టర్లు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై చెరువు భూమిని కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి చెరువు లోపలకి రోడ్లు వేస్తున్నారు. భారీ టిప్పర్లతో తెల్లారేసరికి రోడ్లు వేస్తూ పోతున్నారు. ఇంత అన్యాయం, అక్రమం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పకుపో అని తిట్టి పంపిస్తున్నారు. రియల్టర్ సంస్థలు స్థానికంగా పలుకుబడి ఉన్న లీడర్లు, ఇతర నాయకులకు కొంత ముట్టజెప్పి తమ పని చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ఇరిగేషన్​అధికారులు మాత్రం ఇటుగా రావడం లేదని మండిపడుతున్నారు. చెరువు అన్యాక్రాంతం అవుతుంటే ఎవరూ పట్టించుకోరా..? అని ప్రశ్నిస్తున్నారు. రోడ్లు వేసి, ప్లాట్లు తయారు చేస్తున్న నాయకులు వాటిని అమ్మకానికి కూడా పెడుతున్నారు. ఇలాగే చూస్తూ పోతే కొద్ది రోజుల్లోనే చెరువు కనుమరుగవుతుందని అమీన్​పూర్​గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన రాష్ట్ర మున్సిపల్​ మంత్రి కేటీఆర్​పెద్ద చెరువు అన్యాక్రాంతం పై స్పందించాలని అమీన్​పూర్​వాసులు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed