శ్రీతేజ్ ఇంటికి అల్లు అరవింద్, స్నేహారెడ్డి

by Muthe.Rajitha |

గత ఏడాదిన్నర కాలంగా ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ని పరామర్శించేందుకు అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి నేడు వారి నివాసానికి వెళ్లారు.

శ్రీతేజ్ ఇంటికి అల్లు అరవింద్, స్నేహారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాదిన్నర కాలంగా ప్రాణాలతో పోరాడుతున్న బాలుడు శ్రీతేజ్, అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి నేడు వారి నివాసానికి వెళ్లారు. 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి ప్రాణాలు కోల్పోగా, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన విషయం విదితమే. శ్రీతేజ్ ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్, స్నేహారెడ్డి, ఆ బాలుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగి సుదీర్ఘ కాలం గడుస్తున్నా బాలుడు ఇంకా కోలుకోకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి, అల్లు కుటుంబం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

అలాగే శ్రీతేజ్ చెల్లెలితో అల్లు అరవింద్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని, భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. "నువ్వు బాగా చదువుకో తల్లి.. నీ చదువుకు అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను" అని హామీ ఇచ్చారు. ఘటన జరిగిన నాటి నుండి అల్లు అర్జున్ మరియు 'పుష్ప' చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. శ్రీతేజ్ చికిత్సకు అయిన ఖర్చంతా అల్లు ఫ్యామిలీ, పుష్ప ప్రొడ్యూసర్స్ భరిస్తున్నారు. అలాగే బాధితురాలి మృతికి సంబంధించి ఆ కుటుంబానికి ఇప్పటికే భారీ నష్టపరిహారాన్ని అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా ఆ కుటుంబంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.

Next Story