విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

by Ratna Kumari |

ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. పవన్, గోపాల్ అనే ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదు అందుకున్న వెంటనే డీసీపీవో ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలిన నేపథ్యంలో జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పవన్, గోపాల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో ఈ ఘటన బయటకు రాకుండా కొందరు ఉపాధ్యాయులు సద్దుమణిగేలా ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వెలువడడంతో, ఆ అంశంపై సైతం విద్యాశాఖ దృష్టి సారించినట్లు సమాచారం.

Next Story