రిపబ్లిక్‌ డే వేళ రాష్ట్రాలకు అలర్ట్‌.. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 08:47:54  IST  )

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.

రిపబ్లిక్‌ డే వేళ రాష్ట్రాలకు అలర్ట్‌.. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు (Intelligence Agencies) హెచ్చరించాయి. జనవరి 26 వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పన్నుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్థానీ (Khalistani) ఉగ్రవాదులు, బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన ఉగ్ర ముఠాలు ఈసారి స్థానిక గ్యాంగ్‌స్టర్ల ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. రాజధాని ఢిల్లీనే కాకుండా ఢిల్లీ మాత్రమే కాకుండా, ముంబై, హైదరాబాద్ (Hyderabad) వంటి ప్రధాన నగరాల్లో కూడా అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

నో ఫ్లై జోన్లను పటిష్ఠం చేయాలని ఆదేశాలు..

ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిగే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ (Red Fort), కర్తవ్య పథ్ (Kartavya Path) పరిసరాల్లో నో-ఫ్లై జోన్లను పటిష్ఠం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) హుటాహుటిన రంగంలోకి దిగారు. నగర వ్యాప్తంగా దాదాపు 20 వేల మందితో అదనపు బలగాలను మోహరించారు. హోటళ్లు, లాడ్జీలు, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల పోస్టర్లను ప్రదర్శిస్తూ, ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రెడ్ ఫోర్టు చుట్టూ షార్ప్ షూటర్లు, ఎన్ఎస్‌జీ (NSG) కమాండోలను మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల గుండా ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకులకు యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా వస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపడుతోంది. రాబోయే వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ కొనసాగనున్నట్లుగా కేంద్ర భద్రతా బలగాలు వెల్లడించాయి.

Read More..

దేశంలోనే తొలి 'వందే భారత్ స్లీపర్' ప్రారంభం.. ప్రధాని మోడీ పచ్చజెండా

Next Story