ఎయిర్‌టెల్, జియోల బాదుడు.. 20% టారిఫ్స్ పెంపు!

by Muthe.Rajitha |

దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్స్ జియో, ఎయిర్టెల్ కస్టమర్లకు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.

ఎయిర్‌టెల్, జియోల బాదుడు.. 20% టారిఫ్స్ పెంపు!
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ టెలికాం రంగంలో అత్యంత పెద్ద ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను దాదాపు 20 శాతానికి పైగా పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో లైసెన్స్‌లను సొంతం చేసుకోవడానికి ఈ టెలికాం దిగ్గజాలు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా 4G ప్లాన్ల ధరలకే అపరిమితంగా 5G సేవలను ఉచితంగా అందించడం వల్ల కంపెనీలు ఆశీంచినంత లాభాల్లో లేవు. తాము పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రికవరీ చేసుకోవడంతో పాటు, ప్రతి కస్టమర్ నుండి వచ్చే సగటు ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలనే వ్యూహాత్మక ప్రణాళికతోనే ఈ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరల భారీగా పెంచనున్నాయని తెలుస్తోంది.

ఈ ధరల పెంపుతో పాటు, కస్టమర్లను మరింత ప్రీమియం ప్లాన్ల వైపు మళ్లించేందుకు జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ పాత ప్లాన్ల నిర్మాణంలో భారీ మార్పులు చేస్తూ పలు లాభదాయకమైన ఆఫర్లను పూర్తిగా ఎత్తేశాయి. అంతకుముందు రోజుకు 1.5 GB డేటాను అందించే బేసిక్ ప్లాన్లపై కూడా అపరిమిత (Unlimited) 5G డేటాను ఉచితంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉండేది, కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం రోజుకు కనీసం 2 GB లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ఖరీదైన ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటేనే 5G నెట్‌వర్క్ లభిస్తుందని కంపెనీలు కండిషన్ పెట్టాయి.

దీనికి తోడు, కేవలం మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఉపయోగపడే తక్కువ ధర కలిగిన నెలవారీ బేసిక్ వాల్యూ ప్లాన్లను కూడా మార్కెట్ నుండి పూర్తిగా తొలగించారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు నెలకు కేవలం కాలింగ్ సేవలు పొందాలన్నా సరే భారీ మొత్తాన్ని వెచ్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది, ఫలితంగా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా మార్కెట్‌గా ఉన్న భారత్, ఇప్పుడు క్రమంగా ప్రీమియం ధరల వైపు అడుగులు వేస్తోంది.

Next Story