అరామ్‌కోతో భాగస్వామ్యం కోసం అదానీ గ్రూప్ చర్చలు!

by Disha Web Desk 17 |
అరామ్‌కోతో భాగస్వామ్యం కోసం అదానీ గ్రూప్ చర్చలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ అదానీ గ్రూప్ సంస్థ సౌదీ అరేబియాలో సమర్థవంతమైన భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సౌదీ అరామ్‌కో, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌(పీఐఎఫ్)తో కలిసి ఉమ్మడి పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న అరామ్‌కోలో ఉన్న పీఐఎఫ్ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని అదానీ గ్రూప్ ఆశిస్తోంది. అదానీ సంస్థ అరామ్‌కో వాటా కోసం వేల కోట్లను వెచ్చించకపోయినప్పటికీ, కనీసం స్వల్పకాలానీకి పెట్టుబడి భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి పునరుత్పాదక రంగం, పంట పోషకాలు, రసాయనాల వంటి రంగాల్లో అరామ్‌కో సంస్థ లేదంటే దాని అనుబంద కంపెనీ సబిక్ అదానీ గ్రూప్‌తో జతకట్టే అవకాశాలున్నాయి.

అంతేకాకుండా పీఐఎఫ్ భారత్‌లోని మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టేలా అదానీ సంస్థ ప్రయత్నిస్తోందని, అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, భాగస్వామ్యం ఎలా ఉంటుందనే అంశంపై స్పష్టత రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే అరామ్‌కో ఒప్పందం కోసం దేశీయ దిగ్గజ రిలయన్స్ సంస్థ గతంలో సుదీర్ఘ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికోసం రిలయన్స్ సంస్థ తన చమురు, రసాయనాల విభాగంలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడి కోసం ప్రయత్నించింది. అయితే, గతేడాది నవంబర్‌లో చర్చలు రద్దయ్యాయి. ఆ సమయంలో అరామ్ సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కొనసాగిస్తామని వెల్లడించింది.


Next Story