నటుడు మోహన్ లాల్ వద్ద మరిన్ని ఏనుగు దంతాల బొమ్మలు

by Muthe.Rajitha |

మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి తన వద్ద ఉన్న ఏనుగు దంతాల వివరాలను కేరళ అటవీ శాఖకు అధికారికంగా వెల్లడించారు.

నటుడు మోహన్ లాల్ వద్ద మరిన్ని ఏనుగు దంతాల బొమ్మలు
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి తన వద్ద ఉన్న అదనపు ఏనుగు దంతాలు (ఐవరీ) వివరాలను కేరళ అటవీ శాఖకు అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వన్యప్రాణి ఆమ్నెస్టీ పథకాన్ని ఉపయోగించుకుంటూ ఆయన మలయాటూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్‌లో ఈ డిక్లరేషన్ దాఖలు చేశారు. గతంలోనే 10 ఏనుగు దంతాల వివరాలను వెల్లడించిన మోహన్‌లాల్, తాజాగా మరో 6 ఏనుగు దంతాలతో పాటు 13 ఐవరీ బొమ్మల వివరాలను అటవీ శాఖకు సమర్పించడంతో ఆయన వద్ద ఉన్న మొత్తం ఏనుగు దంతాల సంఖ్య 23 కి చేరింది.

కేరళ అటవీ శాఖ నివేదికల ప్రకారం.. మోహన్‌లాల్ ప్రకటించిన 13 ఐవరీ బొమ్మలలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి బాలాజీ విగ్రహాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 46 కిలోల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తన వద్ద ఉన్న ఈ దంతాలు, విగ్రహాలు తనకు వారసత్వంగా వచ్చినవని లేదా సన్నిహితులు బహుమతులుగా ఇచ్చినవని మోహన్‌లాల్ అధికారులకు వివరించారు. కాగా, నటుడు సమర్పించిన ఈ వస్తువులను ధృవీకరించడానికి అటవీ శాఖ అధికారులు డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించనున్నారు.

భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏనుగు దంతాలు కలిగి ఉండటం, వాటి వాణిజ్యం పూర్తిగా నిషేధమే కాకుండా చట్టవిరుద్ధం. అయితే, గత మార్చిలో కేరళ అటవీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రజలు తమ వద్ద అనధికారికంగా ఉన్న వన్యప్రాణి వస్తువులను చట్టపరమైన చర్యలు లేకుండా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించేందుకు 'ఆమ్నెస్టీ స్కీమ్' కింద ఒక సువర్ణ అవకాశం కల్పించారు. 2011 నాటి ఐటీ దాడుల సమయం నుండి ఏనుగు దంతాల అక్రమ నిల్వల కేసులో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న మోహన్‌లాల్, ఈ కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరిస్తూ తన వద్ద ఉన్న మొత్తం ఐవరీ వస్తువుల వివరాలను డిక్లేర్ చేయడం గమనార్హం.

Next Story