ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విద్యుత్ డీఈ

by Disha Web Desk 13 |
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విద్యుత్ డీఈ
X

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. బాధితుడి నుంచి విద్యుత్ డీఈ మురళీధర్ రెడ్డి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ దామోదర్, యూడీసీ లతీఫ్ లు ముగ్గురూ కలిసి రూ.2 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్లగొండ ఇంచార్జ్ ఏసీబీ డీఎస్పీ శ్రీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రెడ్డి కాలనీ లైన్ మెన్ గుంటూరు శ్రీనివాస్ తన కొడుకు అనారోగ్య కారణాలతో 2004లో ఉద్యోగానికి సెలవు పెట్టాడు.


లీవ్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ బెనిఫిట్స్, 4 పీఆర్సీల బకాయిల బిల్లు చెల్లింపుల కోసం డీఈ కి దరఖాస్తు చేశాడు. గుంటూరు శ్రీనివాస్ కి సుమారు రూ.70 లక్షల మేర ఉద్యోగ ఫలాల కోసం ఏడు నెలలుగా డీఈ మురళీధర్ రెడ్డిని సంప్రదించగా 10శాతం రూ.7 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో లైన్ మెన్ శ్రీనివాస్ రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుని, మార్చి 3వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం డీఈ మురళీధర్ రెడ్డి తన కింది స్థాయి ఉద్యోగులైన జేఏఓ దామోదర్, యూడీసీ లతీఫ్ ల ద్వారా లంచం బాపతు నగదు రూ.2లక్షలు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


మొత్తం 45 మంది సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంతో పాటు డీఈ మురళీధర్ రెడ్డి కి చెందిన హైదరాబాద్, నల్లగొండలోని రెండు ఇండ్లలోను సోదాలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీ కృష్ణ గౌడ్ వెల్లడించారు. విచారణ అనంతరం ముగ్గురు నిందితులని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.


Next Story

Most Viewed