నల్లగొండ మట్టిమనిషికి డాక్టరేట్​

by Disha Web Desk |
నల్లగొండ మట్టిమనిషికి డాక్టరేట్​
X

దిశ, వెబ్​డెస్క్​ : కష్టజీవిని డాక్టరేట్​ వెతుక్కుంటూ వచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి రోజుకు 18 గంటలు శ్రమించిన శ్రామికుడి కలల స్వప్నం కళ్ల ముందుకు వచ్చి నిలబడింది. కట్టెలు కొట్టే స్థాయి నుండి డాక్టర్ పట్టా పొందే వరకు ఎదిగిన అతని జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన గాదె చంద్రశేఖర్​ డాక్టరేట్​ పట్టాపొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''వట్టికోట ఆళ్వారు స్వామి జీవితం - సాహిత్యం '' అంశంపై పరిశోధన చేసిన చంద్రశేఖర్​కు యూనివర్సిటీ అధికారులు డాక్టరేట్ ప్రదానం చేశారు.

గాదె చంద్రశేఖర్​ది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద దళిత కుటుంబం. తల్లిదండ్రులు గాదె వెంకయ్య, యల్లమ్మ. ముగ్గురు అక్కలు, ఓ అన్న ఉన్నారు. పదవ తరగతి వరకు మాడ్గులపల్లిలో, ఇంటర్​, డిగ్రీ మిర్యాలగూడలో చదివారు. 2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ లో పీజీ చదివారు. 2013లో యూజీసీ నిర్వహించిన నెట్​ ఎగ్జామ్​లో జేఆర్​ఎఫ్​ సాధించారు. 2014 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ ప్రవేశం పొంది.. 2022లో డాక్టరేట్ పట్టా పొందారు.

చంద్రశేఖర్​ బాల్యమంతా ఇటుక బట్టీల్లో మసిబారింది. అమ్మనాన్నతో కలిసి ఎక్కడ పని ఉంటే అక్కడికి వలస వెళ్లేవాడు. పొద్దంతా పని చేస్తేనే రాత్రికి కడుపునిండేది. ఏడు నుంచి పదో తరగతి వరకు విద్యుత్ సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ గా చేరి నెలకు రూ.400 జీతం తీసుకున్నాడు. ఆ తర్వాత సుతారి పనులకు, ఇటుక బట్టీల్లో కూలీ పని చేశాడు. టెన్త్​ క్లాస్​ నుంచి డిగ్రీ వరకు కట్టెలు కొడుతూ.. పెయింటింగ్​ పనులు చేశాడు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ చదువుకున్నాడు. ఎన్నెన్ని కల్లోలాలు ఎదురైనా పుస్తకాల్ని వదల్లేదు. గొడ్డలి పట్టిన చేతులతోనే తన చరిత్ర తిరగరాసుకున్నాడు. చెదిరిన బతుకులో చెదరని విశ్వాసం నింపుకున్నాడు. యూనివర్సిటీ హాస్టల్లో చేరినా మల్కాజ్గిరిలోని ఓ లిక్కర్ కంపెనీలో కార్మికుడిగా చేరి రాత్రంతా పని చేస్తూ పగలంతా యూనివర్సిటీలో పాఠాలు విన్నాడు. ఇలా మట్టి పాదాలతో ఉస్మానియా యూనివర్శిటీ మమెట్లెక్కి డాక్టరేట్ అయ్యాడు. కసి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన ఇష్టంగా మారి విజయాన్ని అందిస్తుందనడంలో గాదె చంద్రశేఖర్​ జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు.


Next Story

Most Viewed