మానసిక స్థితి బాగా లేకున్నా జనరల్‌కు షిఫ్ట్.. ఆత్మహత్య చేసుకున్న రోగి

by Disha Web Desk 13 |
మానసిక స్థితి బాగా లేకున్నా జనరల్‌కు షిఫ్ట్.. ఆత్మహత్య చేసుకున్న రోగి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలోని కూలి కుతుబ్ షా బిల్డింగ్ 4వ అంతస్తు నుండి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ మండలం వెంకటాపుర్ గ్రామంలోని వీకరిసెక్షన్ కాలనీకి చెందిన నాగరాజు(26) కుటుంబ కలహాలతో ఈనెల 2వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఐఎంసీలో చికిత్స పొందుతున్న నాగరాజు మానసిక పరిస్థితి బాగోలేదు.

ఈ క్రమంలో అతన్ని మంగళవారం కూలి కుతుబ్ షా 4వ అంతస్తు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. జనరల్ వార్డులో బాత్రూంలోకి వెళ్లిన నాగరాజు రాత్రి 11 గంటల సమయంలో కిటికీ అద్దాలు పగులగొట్టి, 4వ అంతస్తు నుండి కిందికి దూకాడు. దీంతో నాగరాజు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మానసిక పరిస్థితి బాగలేకున్నా జనరల్ కు షిఫ్ట్ చేశారని, నాగరాజు మృతికి నర్సులు, వైద్య సిబ్బందే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జలగంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.


Next Story