అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. హత్య అంటూ బంధువుల ఆరోపణ

by Dishafeatures2 |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. హత్య అంటూ బంధువుల ఆరోపణ
X

దిశ, నేరేడుచర్ల /గరిడేపల్లి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కుతుబ్ షా పురం (అగ్రారం)లో చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం కుతుబ్ షా పురం గ్రామానికి చెందిన జక్కుల గురవయ్య (50) శనివారం మేకలను మేపడానికి వెళ్ళాడు . మేకలు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. గురవయ్య ఇంటికి రాకపోవడంతో బంధువులు స్థానికులు రాత్రి వరకు వెతికారు. ఆదివారం ఉదయం కుతుబ్‌ షా పురం నుంచి కొనాయి గూడెం వెళ్లే దారిలోని దర్గా సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో చెప్పులు తేలడంతో అందులో వెతకారు. ఆ బావిలో గురవయ్య మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని బయటకు తీయగా చెయి తలమీద బలమైన రక్తపు గాయాలు ఉండడంతో గురవయ్య మృతిపై ఆయన బంధువులు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ గ్రామంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబరు 453లో తన స్వాధీనంలో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేసినట్లు వారి మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతుందని, దీని వెనుక ఏమైనా వారి హస్తం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed