పేలిన కారు టైరు.. అక్కడిక్కడే మృతి చెందిన యువకుడు

by Dishafeatures2 |
పేలిన కారు టైరు.. అక్కడిక్కడే మృతి చెందిన యువకుడు
X

దిశ, కంది : ఓ పనిపై ఆ యువకుడు హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి వచ్చి పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో అవతలి రోడ్డు పై ఒక కారు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వస్తుంది. ఒక్కసారిగా ఆ కారు టైరు పగిలిపోయింది. దాంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టుకుంటూ వచ్చి ఎదురుగా వస్తున్న యువకుడిని ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాచుపల్లికి చెందిన వి.రాజు (26) గురువారం మధ్యాహ్నం తన స్కూటీ ( TS08HM7876 )పై పని నిమిత్తం సంగారెడ్డికి వచ్చాడు.


పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై ఉన్న బాలాజీ హాస్పిటల్ వద్దకు రాగానే అటువైపు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ( TS08FR0920 ) బ్రీజా కారు టైర్ పగిలిపోయింది. దీంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న రాజు స్కూటీ వాహనాన్ని గట్టిగా ఢీ కొట్టాడు. దాంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని ఎస్సై సుభాష్ వివరించారు.



Next Story

Most Viewed