ఆదిలాబాద్ ప్రజావాణిలో ఆప్యాయత దృశ్యం

by Batti.Sumithra |

ప్రజావాణి కార్యక్రమంలో సాధారణంగా సమస్యలు, వినతులు, ఫిర్యాదులు కనిపిస్తుంటాయి.

ఆదిలాబాద్ ప్రజావాణిలో ఆప్యాయత దృశ్యం
X

దిశ, ఆదిలాబాద్ : ప్రజావాణి కార్యక్రమంలో సాధారణంగా సమస్యలు, వినతులు, ఫిర్యాదులు కనిపిస్తుంటాయి. అయితే సోమవారం, ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అందరి హృదయాలను హత్తుకునే అరుదైన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా చూపిన మానవత్వానికి ఓ వృద్ధురాలు తన ఆప్యాయతతో కృతజ్ఞతలు తెలపడం అక్కడి వారిని భావోద్వేగానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే బజార్‌హత్నూర్ మండలం జాతర్ల (రాంనగర్) గ్రామానికి చెందిన వృద్ధురాలు సుభద్రకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అదే రోజు ఆమెతో గృహప్రవేశం కూడా చేయించారు.

దీంతో ఆనందానికి అవధులు లేకపోయిన సుభద్ర, ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌ను కలిసి తన కృతజ్ఞతను ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుభద్ర కలెక్టర్ రాజర్షి షా నుదుటి పై బొట్టుపెట్టి, రాఖీ కట్టి సత్కరించారు. అనంతరం ఆయనకు హృదయపూర్వకంగా ఆశీస్సులు అందించారు. కలెక్టర్ కూడా ఆమెను ఆప్యాయంగా 'అరే సుభద్ర గారు..' అంటూ పలకరిస్తూ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఆప్యాయ సంభాషణ అక్కడ ఉన్న అధికారులను, ప్రజలను ఆకట్టుకుంది. సమస్యల పరిష్కారంతో పాటు మానవీయ విలువలకు పెద్దపీట వేస్తూ ప్రజలకు చేరువగా ఉండే పాలనకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రజావాణి కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ హృద్యమైన సంఘటనను చూసిన పలువురు కలెక్టర్ మానవత్వాన్ని అభినందించగా,వృద్ధురాలు వ్యక్తం చేసిన కృతజ్ఞత అందరినీ కదిలించింది.

Next Story