ఒక‌రిపై ఒక‌రు 60 కేసులు పెట్టుకున్న జంట‌.. సుప్రీంకోర్టు ఏమందో తెలుసా?!

by Disha Web Desk 20 |
ఒక‌రిపై ఒక‌రు 60 కేసులు పెట్టుకున్న జంట‌.. సుప్రీంకోర్టు ఏమందో తెలుసా?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'అనుమానం పెనుభూత‌మ‌నే' నానుడి ఉండ‌నే ఉంది. ఒక్క‌సారి దాని బారిన‌ప‌డితే అది మ‌నిషిని అన్నింటి నుండి దూరం చేస్తుంది. బంధాలు తెగిపోయి బాధ‌లు మాత్ర‌మే మిగుల్చుతుంది. అయితే కానీ మ‌న‌సు లేని చోట ఏ సంబంధ‌మూ స‌రిగ్గా అత‌క‌దు. చిటుక్కుమ‌న్నా చిరాకే, ప‌ల‌కరించినా మ‌హా పాప‌మే... ఇలా ఓ వింత దంప‌తులు విడిపోయిన గత 41 ఏళ్ల కాలంలో ఒకరిపై ఒకరు 60 కేసులు పెట్టుకున్నారు. కార‌ణాలు అనేకానేకం..! దీనిపై భార‌త సుప్రీంకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి న్యాయవాదుల 'చాతుర్యాన్ని' గుర్తించాలని పేర్కొన్న న్యాయ‌స్థానం, వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరింది.

"ఏం చేయాలి. కొందరికి కొట్లాటలు ఇష్టం. వారు ఎప్పుడూ కోర్టులో ఉండాలని కోరుకుంటారు. కోర్టును చూడకపోతే నిద్ర రాదు" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం వీరినుద్దేశించి వ్యాఖ్యానించింది. విడిపోయిన వారి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వివాదాన్ని శాంతియుతంగా ప‌రిష్కరించుకోడాని మధ్యవర్తిత్వం కోసం దంపతులు వెళ్లాల‌ని ఆదేశించింది. 30 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్ద‌రూ మొత్తం 60 కేసులు దాఖలు చేశారని, ఇద్ద‌రూ విడిపోయి 11 ఏళ్లు అవుతుంద‌ని తెలుసుకున్న న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మధ్యవర్తిత్వం కాలపరిమితితో కూడిన ప్రక్రియ కాబట్టి, ఈలోపు ఇతర పెండింగ్ కేసులను కొనసాగించడానికి పార్టీలను అనుమతించలేమని బెంచ్ స్పష్టం చేసింది. 'అవ్వా కావాలి బువ్వా కావ‌లంటే కుద‌ర‌దు' అని మహిళ తరఫు న్యాయవాదికి బెంచ్ స్ప‌ష్టం చేసింది.

Next Story

Most Viewed