ఎస్‌బీఐ ఫౌండేషన్ 'పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్‌'‌కు భారీ విరాళం ప్రకటన

by Disha Web Desk 13 |
ఎస్‌బీఐ ఫౌండేషన్ పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్‌‌కు భారీ విరాళం ప్రకటన
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సేవా కార్యక్రమాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడు ముందుంటుందని బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్) అండ్ సీడీఓ ఓం ప్రకాష్ మిశ్రా అన్నారు . ఈ మేరకు శుక్రవారం ఎస్‌బీఐ విభాగమైన ఎస్‌‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ లో భాగంగా బంజారాహిల్స్ లోని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ట్రస్ట్ భాగస్వామి అయిన స్పర్ష్ హాస్పైస్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ ప్రాజెక్ట్‌ రూ 3.13 కోట్ల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు.

ఈ నిధులతో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో హోమ్‌కేర్ ఆధారిత పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్‌ను బలోపేతం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుండి సుమారు 1700 మంది ప్రాణాంతక రోగులకు వారి ఇండ్ల వద్దనే వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. "స్పర్ష్ హాస్పైస్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్" లో శిక్షణ పొందిన నర్సులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలతో పాటు కౌన్సెలర్‌లతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం అందుబాటులో ఉందని, ఈ బృందం మొబైల్ మెడికల్ వ్యాన్‌ల ద్వారా సామాజిక, ఆర్థిక బలహీన కుటుంబాలకు ఇండ్ల వద్దనే సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


హోమ్‌కేర్ సేవల్లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఎప్పటికప్పుడు వైద్యం, టెలి-కౌన్సెలింగ్, సోషల్ సపోర్ట్, ఉచిత మందులు ఇవ్వడమే కాకుండా ఒకవేళ పరిస్థితి విషమించి మరణిస్తే వారికి తగిన సహాయం కూడా అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులతో పాటు స్పర్ష్ హాస్పైస్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed