అర్ధరాత్రి యుద్ధం వచ్చినా.. 74-రోజుల భద్రతా వలయం:పెట్రోలియం నిల్వలపై హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

ప్రస్తుతం దేశం వద్ద 74 రోజులకు సరిపడా భారీ పెట్రోలియం నిల్వలు (Strategic Petroleum Reserves) సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా స్తంభించి కాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని పెట్రోలియం శాఖమంత్రి భరోసా ఇచ్చారు.

అర్ధరాత్రి యుద్ధం వచ్చినా.. 74-రోజుల భద్రతా వలయం:పెట్రోలియం నిల్వలపై హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో వివిధ రూపంలో సంక్షోభం కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Global Turbulence) పెచ్చుమీరినా, సరఫరా గొలుసు దెబ్బతిన్నా, భారత ఇంధన అవసరాలపై ఎటువంటి ప్రభావం పడుతుందనే ప్రశ్న రాజ్యసభలో వచ్చింది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో స్పందిస్తూ.. అంతర్జాతీయ సంక్షోభం భారత్ పై ఏమాత్రం ఆటంకం కలగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం వద్ద 74 రోజులకు సరిపడా భారీ పెట్రోలియం నిల్వలు (Strategic Petroleum Reserves) సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా స్తంభించి కాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన భరోసానిచ్చారు.

అలాగే భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో, ఇంధన భద్రత అనేది దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు దిగుమతులు నిలిచిపోయినా, భారత్ బలహీనపడకుండా ఉండటానికి అత్యంత పటిష్టమైన, సురక్షితమైన నిల్వలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ స్థాయిలో చమురును నిల్వ చేసే వ్యవస్థలను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది.

భారత్ తన తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో అనేక రిఫైనరీలను కలిగి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భంలో భారీ గుహలను నిర్మించి, అందులో ముడి చమురును భద్రపరిచారు. ఇవి కేవలం సంక్షోభ సమయాల్లో మాత్రమే వాడుకోవడానికి ఉద్దేశించినవి. దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు అకస్మాత్తుగా పెరిగినా, యుద్ధాల వల్ల రవాణా నిలిచిపోయినా మన దేశంపై వెంటనే ప్రభావం పడదు.

గతంలో భారత్ కేవలం కొన్ని దేశాల నుంచి చమురును కొనుగోలు చేసేది, కానీ ఇప్పుడు తన కొనుగోలు వ్యూహాన్ని మార్చుకుంది. రష్యా, అమెరికా వంటి విభిన్న దేశాల నుంచి ముడి చమురును సేకరిస్తూ రిస్క్ తగ్గిస్తోంది. ఈ 74 రోజుల నిల్వ సామర్థ్యం కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఈ నిల్వలను మరింత పెంచే దిశగా మరిన్ని భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాజ్యసభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.

Next Story