మీ ఇంట్లో పనిమనుషులు ఉన్నారా.. తస్మాత్ జాగ్రత్తా

by Batti.Sumithra |

హైదరాబాద్ నగరంలో పనిమనుషుల దొంగతనాలు తీవ్రకలకలం రేపుతున్నాయి.

మీ ఇంట్లో పనిమనుషులు ఉన్నారా.. తస్మాత్ జాగ్రత్తా
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ నగరంలో పనిమనుషుల దొంగతనాలు తీవ్రకలకలం రేపుతున్నాయి. రెండేండ్లలో నగరంలో దాదాపు 565 చోరీ కేసులు నమోదైన తీరుతో పోలీసులు కలవరానికి గురవుతున్నారు. ఈ నేపధ్యంలో పనిమనుషులను నియమించుకునే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పనిమనుషులు నమ్మకంగా పనికి ఇంట్లో చేరి అవకాశం దొరకగానే చోరీలు చేసి యజమానులను పరేషాన్ చేస్తున్నారని పోలీసులు జరిపిన దర్యాప్తులో స్పష్టమైంది. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్ళే కుటుంబాలు, ఒంటరిగా ఉండే వ్రుద్ధులు, ఐటీ ఉద్యోగాలకు వెళ్ళే ఫ్మామిలీల ఇండ్లలో పనిచేసే పనిమనుషులు ఈ చోరీలకు పాల్పడుతున్నారని నమోదైన కేసులతో తెలుస్తోంది.

ఇలా బిజిబిజిగా ఉండే ఇండ్లలో నమ్మకంగా పనికి చేరుతున్న పనిమనుషులు వారు ఇంట్లో వారు ఎక్కడెక్కడ నగదు, బంగారం, వెండి ఆభరణాలను పెడుతున్నారు, నిర్లక్ష్యంగా వాటిని ఏలా వదిలేస్తున్నారనే అంశాలను నిశితంగా గమనిస్తు అవకాశం దొరకగానే వాటిని దొంగతనం చేస్తు పారిపోతున్నారు. ఇలా చోరీలు జరగడానికి ఇంటి యజమానుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణంగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ జోన్ -173, సికింద్రాబాద్ జోన్ -88, ఖైరతాబాద్ జోన్-77, గోల్కోండ జోన్-70, రాజేంద్రనగర్ జోన్-63, శంషాబాద్ జోన్-49, చార్మినార్ జోన్-45 పనిమనుషుల చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన పోలీసులు పనిమనుషుల నేరాలు జరగకుండా ఉండడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

వెరిఫికేషన్ చేసుకోండి..అప్రమత్తంగా ఉండండి-పోలీసులు

నేరం జరిగిన తర్వాత పరుగులు పెట్టడం కంటే వాటిని నివారించడానికి పోలీసులు కొన్ని సూచనలు చేస్తు్న్నారు. వీటిని పాటించి పనిమనుషుల చేసే చోరీలు అరికట్టేందుకు కంచె ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

ఇంట్లో, ఆఫీసులు, దుకాణాల్లో పని మనుషులను పెట్టుకునే సమయంలో కచ్చితంగా గుర్తింపు కార్డు, తాజా ఫోటో, స్వగ్రామం, ఫోన్ నెంబర్ల వివరాలను సేకరించుకోవాలి.

ఏజెన్సిలు, మధ్యవర్తుల ద్వారా పనిమనుషులను నియమించుకుంటే ఆ ఏజెన్సిలకు ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉన్న విషయాన్ని పరిశీలించుకోవాలి.

గతంలో పని చేసిన చోట యజమానులతో మాట్లాడి వారి పని తీరు వ్యవహారశైలి గురించి తెలుసుకోవాలి.

పనిమనుషులను నియమించుకునే ముందు వారి వివరాలను స్థానిక పోలీసు స్టేషన్ లో అధికారులకు తెలిపి వెరిఫికేషన్ చేసుకోవాలి.

పనిలో చేరిన వారి ప్రవర్తన, పని తీరును నిశితంగా 30 రోజుల పాటు గమనించాలి.ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేయాలి.

ఇంట్లోని డబ్బులు, బంగారం, విహార యాత్రల వంటి విషయాలను పని మనుషుల ముందు అసలు మాట్లాడొద్దు.

గేటడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లలోని రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వారి ప్రాంగణాలలో పని చేసే పనిమనుషుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర వివరాలను భద్రపర్చుకోవాలి. రిజిస్టర్ ఏర్పాటు చేసుకుని వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి.

ఇలా జాగ్రత్తలు పాటించి నేరం జరగకుండా భద్రత పరమైన వాతావరణాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మన నిర్లక్ష్యమే నేరాలు చేయడానికి అవకాశం కల్పిస్తుందనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని పోలీసులు వివరిస్తున్నారు. పనిమనుషుల వ్యవహారం పై అనుమానాలు ఉంటే డయల్ 100 లేదా 9490616555 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Next Story