300 ఏళ్లనాటి మత్స్యకన్య : మనిషి ముఖంతో.. మమ్మీ స్థితిలో!

by Dishafeatures2 |
300 ఏళ్లనాటి మత్స్యకన్య : మనిషి ముఖంతో.. మమ్మీ స్థితిలో!
X

దిశ, ఫీచర్స్ : 'మత్స్య కన్య' ఆకారంలో ఉన్న 300 ఏళ్ల నాటి మమ్మీపై జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 నుంచి 1741 మధ్య కాలంలో జపనీస్ ఐలాండ్ షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల పొడవున్న ఈ మర్మజీవి చేపల వలకు చిక్కింది. ఇందుకు సంబంధించిన సమాచారంతో కూడిన ఓ లేఖతో పాటు ఈ మమ్మీని ఓ పెట్టెలో భద్రపరిచినట్లు జపాన్‌లోని షింబున్ వార్తాపత్రిక పేర్కొంది. అయితే ప్రస్తుతం అసాకుచి నగరంలోని గుడిలో భద్రపరచబడిన ఈ మత్స్యకన్య లక్షణాలు చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు.

పదునైన దంతాలు, నవ్వు ముఖం, రెండు చేతులు కలిగి ఉన్న మమ్మీ.. తల, నుదుటిపై వెంట్రుకలు కలిగి ఉంది. ఎగువ భాగం మనిషి పోలినట్లుగా ఉన్నప్పటికీ దిగువ భాగంలో మాత్రం పొలుసులుగా ఉండే తోకతో చేప లక్షణాలు కనిపిస్తున్నాయి. కాగా దీని రహస్యాలను వెలికి తీసేందుకు కురాషికి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కాగా జపనీస్ మత్స్యకన్యల మాంసం తింటే ఎప్పటికీ చనిపోరనే పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి.

అంతేకాదు అనుకోకుండా ఈ మాంసం తిన్న ఒక మహిళ 800 ఏళ్లు బతికిందనే వార్తలు జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్నట్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ఒకాయమ ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత వెల్లడించారు. ఈ పురాణాన్ని విశ్వసించేవారు.. మత్స్యకన్య మమ్మీల పొలుసులను చెవిలో పెట్టుకునేవారని, ఒక మత్స్యకన్య రాబోయే అంటువ్యాధులను కూడా అంచనా వేసేదని చెప్పారు.



Next Story