మానవ సంబంధాలు మరిచిన మృగానికి 20 ఏళ్ల జైలు శిక్ష!

by Disha Web Desk 13 |
మానవ సంబంధాలు మరిచిన మృగానికి 20 ఏళ్ల జైలు శిక్ష!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పదిహేనేళ్ల కన్న కూతురిపై లైంగిక దాడి చేసిన ఓ కన్నతండ్రి కి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (ప్రత్యేక పోక్సో కోర్టు) సి.హెచ్ పంచాక్షరీ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఉరడి పోశెట్టి.. తన కన్న కూతురు పై 28 జాన్ 2019 కి పూర్వం పలుమార్లు కన్న తల్లి ఇంట్లో లేని సమయంలో రాత్రిపూట లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు అడ్డుపడిన చిన్న కూతురును ఒక గదిలో బంధించి పెద్ద కూతురిపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆ బాలికకు గర్భం రావడానికి కారకుడై, గర్భ విచ్చితికి మెడిసిన్స్ ఇప్పించి.. ఈ విషయాన్ని తల్లికి కానీ ఇతరులకు గాని చెబితే చంపేస్తానని బెదిరించాడు. రుద్రూర్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి ఉరడి పోశేట్టిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

పోలీసులు సమర్పించిన సాక్షదారాలను పరిశీలించిన కోర్టు ఇరవై ఏడు పేజీల తీర్పులో.. నిజామాబాద్ జిల్లా బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కోర్టుకు సమర్పించిన అభియోగాల ఆధారంగా, నేర న్యాయ విచారణలో భాగంగా, పన్నెండు మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని, పది దృవీకరించుకున్న పత్రాలను పరిశీలించుకుని ముద్దాయి ఉరడి పోశెట్టికి శిక్షను ఖరారు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ చట్టం, 2012 సెక్షన్ 5( j ) (¡¡) రెడ్ విత్ 6 ప్రకారం ఇరవై ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమాన చెల్లించని ఎడల అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 323(గాయపర్చడం), సెక్షన్ 506 (చంపుతానని బెదిరించడం) నేరాలు రుజువు కావడంతో సదరు సెక్షన్ ప్రకారం వేయి రూపాయల జరిమాన విధించారు. జరిమానా చెల్లించినచో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ వాదనలు వినిపించారు. బాధిత బాలికకు రూ.లక్ష యాబై వేల పరిహారం బాధిత బాలికకు కోర్టు తీర్పు ప్రతి స్వీకరించిన నెలలోపు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ లక్ష యాభై వేల రూపాయల పరిహారం అందజేయాలని ప్రత్యేక ఫోక్సో కోర్టు సిఫార్సు చేసింది.

Next Story

Most Viewed