20 మంది రెబల్ ఎంపీలు ప్రజలను మోసం చేశారు: అభిషేక్ బెనర్జీ

by Malleboina Mahesh |

20 మంది రెబల్ ఎంపీలు రాజ్యాంగాన్ని అవమానించారని, వారిపై ఆధారాలు నిరూపిస్తానని స్పీకర్ ఓం బిర్లాతో బేటీ అనంతరం ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన సవాల్ విసిరారు.

20 మంది రెబల్ ఎంపీలు ప్రజలను మోసం చేశారు: అభిషేక్ బెనర్జీ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 20 మంది రెబల్ ఎంపీల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తో భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలో స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుగుబాటు చేసిన ఎంపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఈ 20 మంది రెబల్ ఎంపీలు ప్రజలను ఘోరంగా వంచించడమే కాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా ధిక్కరించారు, అవమానించారని విమర్శించారు. తమ మనస్సాక్షిని, గౌరవాన్ని, నైతికతను వారు పూర్తిగా అమ్ముకున్నారని. బెంగాల్ ప్రజలు వీరిని జీవితంలో ఎన్నటికీ క్షమించరని అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు.

ఈడి (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడానికే వారు ఈ తిరుగుబాటుకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వారి నియోజకవర్గాల్లో ఏ ఒక్క పౌరుడు కూడా వారికి మద్దతుగా నిలబడటం లేదని, అందుకే వారిలో చాలామందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను (Central Security) కల్పించిందని ఎద్దేవా చేశారు. "రెబల్ ఎంపీలలో కొందరికి భారీగా డబ్బు అందింది, మరికొందరిని కేంద్ర సంస్థలతో బెదిరించారు. ఇందుకు సంబంధించి నా వద్ద తిరుగులేని పక్కా ఆధారాలు ఉన్నాయి. నా వ్యాఖ్యలు ఎవరికైనా నొప్పి కలిగిస్తే, నాపై కోర్టులో కేసు వేసుకోవచ్చు. నా వద్ద ఉన్న ప్రతి ఒక్క ఆధారాన్ని న్యాయస్థానం ముందే నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు.

Next Story