ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం PRC ప్రకటించిన ప్రభుత్వం

by Muthe.Rajitha |

గత మూడు రోజులుగా సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం PRC ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : గత మూడు రోజులుగా సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం వేతన సవరణ (PRC) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై విధివిధానాల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. "ఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మన కుటుంబ సభ్యులే" అని భట్టి విక్రమార్క పేర్కొంటూ.. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు.

కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నేతలు

ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ, కార్మికుల ఆర్థిక మరియు వృత్తిపరమైన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించి, విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు.

Next Story