సర్పంచ్‌ని కిడ్నాప్ చేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి వర్గీయులు యత్నం (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-11-11 15:53:31  IST  )

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సర్పంచ్‌ని కిడ్నాప్ చేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి వర్గీయులు యత్నం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గ్రామ సర్పంచ్ మా వాడు అంటే మా వాడు అంటూ బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ బీఎస్పీ పార్టీలో చేరడంతో ఈ వివాదం నెలకొంది. ఇంతకూ ఏం జరిగిందంటే..బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాతర్లపాడు సర్పంచ్ కేశబోయిన మల్లయ్య తన అనుచరులతో ఇవాళ బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ సూర్యాపేట అభ్యర్థి వట్టే జానయ్య సమక్షంలో కొంతమంది యాదవ సంఘం నాయకులు, తన అనుచరులతో కలిసి సర్పంచ్ మల్లయ్య ఆ పార్టీలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు(ఎస్) ఎంపీపీ భర్త మార్ల చంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణతో పాటు మరి కొంతమంది మంత్రి జగదీశ్ రెడ్డి వర్గీయులు పాతర్లపాడు గ్రామానికి చేరుకుని సర్పంచ్ మల్లయ్యను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో వట్టే జానయ్య, గోపగాని వెంకట నారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌ను నువ్వు ఎట్లా బీఎస్పీలో చేర్చుకుంటావ్ అంటూ వట్టే జానయ్యతో గొడవకు దిగారు. ఈలోపు బీఎస్పీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని సర్పంచ్ మల్లయ్యను బీఆర్ఎస్ పార్టీ నాయకుల కారు నుంచి దింపి తీసుకెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ మల్లయ్య తను బీఎస్పీలో చేరానని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story